టీమిండియా సెమీస్ చేరాలంటే ఏం జరగాలి?

జింబాబ్వేపై వెస్టిండీస్ భారీ గెలుపు తర్వాత భారత్ సెమీస్ అవకాశాలు ఇప్పుడు పక్కా లెక్కల మీద ఆధారపడి ఉన్నాయి. నెట్ రన్ రేట్ చాలా తక్కువగా ఉన్న నేపథ్యంలో, టీమిండియా పాయింట్ల ఆధారంగా సులువుగా ముందడుగు వేయాలంటే కొన్ని సమీకరణాలు అనుకూలంగా ఉండాలి. ముఖ్యంగా ఫిబ్రవరి 26న జరిగే మ్యాచ్‌లు కీలకంగా మారనున్నాయి.

మొదటి సమీకరణం ఏంటంటే.. సౌత్ ఆఫ్రికా తన తదుపరి రెండు మ్యాచ్‌ల్లో వెస్టిండీస్‌ను, జింబాబ్వేను ఓడించాలి. ఇలా జరిగితే సౌత్ ఆఫ్రికా 6 పాయింట్లతో టేబుల్ టాప్‌లో ఉంటుంది. అప్పుడు భారత్ తన తదుపరి రెండు మ్యాచ్‌ల్లో (జింబాబ్వే, వెస్టిండీస్) విజయం సాధిస్తే, 4 పాయింట్లు వస్తాయి. విండీస్ 2 పాయింట్లతోనే ఆగిపోతుంది కాబట్టి, రన్ రేట్‌తో సంబంధం లేకుండా భారత్ నేరుగా సెమీస్‌కు వెళ్లే అవకాశం ఉంటుంది.

అయితే ఇక్కడే ఒక చిక్కు ఉంది. ఒకవేళ వెస్టిండీస్ జట్టు సౌత్ ఆఫ్రికాను ఓడిస్తే మాత్రం భారత్‌కు కష్టాలు మొదలవుతాయి. అప్పుడు భారత్, సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్.. (జింబాబ్వేను ఓడిస్తే) ఈ మూడు జట్లు చెరో రెండు విజయాలతో 4 పాయింట్ల దగ్గర సమానంగా నిలిచే ఛాన్స్ ఉంది. ఆ సమయంలో ఏ రెండు జట్లు సెమీస్ వెళ్లాలో నెట్ రన్ రేట్ ఆధారంగా నిర్ణయిస్తారు. ప్రస్తుతం భారత్ రన్ రేట్ చాలా తక్కువగా ఉంది కాబట్టి, ఆ పరిస్థితి వస్తే ఇంటిదారి పట్టాల్సి వస్తుంది.

అందుకే భారత్ తన వైపు నుంచి చేయాల్సింది ఏంటంటే.. మొదట జింబాబ్వేపై ఘనవిజయం సాధించాలి. ఆ తర్వాత మార్చి 1న జరిగే మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను భారీ రన్ రేట్ తేడాతో ఓడించాలి. ఇలా చేయడం వల్ల ఒకవేళ రన్ రేట్ లెక్కలోకి వచ్చినా పోటీలో ఉండే అవకాశం ఉంటుంది.

అంటే భారత్ గెలవడమే కాకుండా, సౌత్ ఆఫ్రికా తన జోరును కొనసాగించి విండీస్‌ను అడ్డుకోవాలని కోరుకోవాలి. టీమిండియా భవితవ్యం ఇప్పుడు సౌత్ ఆఫ్రికా ప్రదర్శన మీద కూడా ఆధారపడి ఉంది. రెండు మ్యాచ్‌లు గెలుస్తూ, సఫారీలు విండీస్‌ను ఓడిస్తే భారత్ దారి సుగమం అవుతుంది. మరి ఈ వారం రోజుల్లో జరిగే ఈ సమీకరణాల్లో ఏది నిజమవుతుందో చూడాలి.