25 నుంచి సెకండ్ వేవ్ లాక్ డౌన్ రూల్స్ ?

Lockdown

ప్రాణాంతక వ్యాధి కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభించబోతోందా ? అంటే అవుననే అంటున్నారు వైద్య నిపుణులు. జనవరి 15వ తేదీ నుండి మార్చి 15వ తేదీ మధ్యలో కరోనా వైరస్ మహమ్మారి మళ్ళీ రెచ్చిపోయే అవకాశం ఉందంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సెకండ్ వేవ్ ప్రజలపై తీవ్ర ప్రభావం చూపకుండా ముందస్తు చర్యలు తీసుకోవలంటూ నిపుణుల కమిటి ప్రభుత్వానికి ముందస్తు హెచ్చరికలు చేయటం కలకలం రేపుతోంది.

గతంలో వచ్చిన మొదటిసారి కరోనా రాష్ట్రంలో ఎంతటి కల్లోలం రేపిందో నిపుణుల కమిటి తన నివేదికలో గుర్తుచేసింది. మళ్ళీ అటువంటి పరిస్ధితి పునరావృతం కాకూడదంటే ప్రభుత్వం నిబంధనల అమలులో కచ్చితంగా ఉండాల్సిందే అని తేల్చి చెప్పింది. ప్రస్తుతం కరోనా తీవ్రత తగ్గినా రోజుకు 700 కేసులైతే నమోదవుతున్నాయి. రష్యా, అమెరికా, బ్రెజిల్, ఇటలీ, స్పెయిన్ లాంటి అనేక దేశాల్లో కరోనా తగ్గినట్లే తగ్గి మళ్ళీ సెకండ్ వేవ్ ప్రారంభమవ్వటం, ఆ దేశాల్లోని జనాలు విలవిల్లాడిపోతుండటాన్ని కమిటి తన నివేదికలో ప్రస్తావించింది.

కమిటి సిఫారసుల్లో భాగంగానే ఈనెల 26వ తేదీ నుండి హోటళ్ళు, సినిమా థియేటర్లు, రెస్టారెంట్లు, మార్కెట్లు, మాల్స్ తదితర పబ్లిక్ ప్లేసుల్లో మళ్ళీ ఆంక్షలు విధించేందుకు ప్రభుత్వం రెడీ అయిపోతోంది. జిల్లాలపై సమీక్షలు నిర్వహించి మళ్ళీ కంటైన్మెంట్ జోన్లను ప్రకటేంచే అవకాశాలను పరిశీలిస్తోంది. 65 ఏళ్ళు పైబడిన వృద్ధులు, గర్భిణిలు, పదేళ్ళలోపు చిన్నపిల్లలను బయట తిరగొద్దని ప్రభుత్వం చెబుతోంది.

సెకండ్ వేవ్ ను దృష్టిలో పెట్టుకునే అవసరమైన మందులు, వైద్యసిబ్బందిని, ఆసుపత్రులను, పడకలను, ప్రత్యేకంగా కోవిడ్ కేంద్రాలను ఇఫ్పటినుండి రెడీ చేస్తోంది ప్రభుత్వం. కరోనా వైరస్ ఉధృతంగా ఉన్నపుడు ఎటువంటి చర్యలు తీసుకున్నదో అలాంటిదే మళ్ళీ మొదలుపెట్టడానికి ప్రభుత్వం రెడీ అయిపోతోంది.

సెకండ్ వేవ్ ను దృష్టిలో పెట్టుకునే ఈనెల 26వ తేదీ నుండి జనవరి 1వ తేదీవరకు అన్నీ వేడుకలను రద్దు చేసే ఆలోచనలో ఉంది. డిసెంబర్ 31, జనవరి 1వ తేదీన పూర్తిగా కర్ఫ్యూ విధించే పరిస్దితిని పరిశీలిస్తోంది. వైన్ షాపులు, బార్ల సమయాన్ని కుదించేయోచనలో కూడా ఉంది. పెళ్ళిళ్ళు, రాజకీయ కార్యక్రమాల్లో హాజరయ్యే జనాల సంఖ్యపైన కూడా పరిమితి విదించబోతోంది. మొత్తానికి సెకండ్ వేవ్ అంటేనే జనాలతో పాటు ప్రభుత్వంలో కూడా ఆందోళన పెరిగిపోతోంది.