ప్రియుడు వదిలేశాడు.. మంచు కొండల్లో గడ్డకట్టి చనిపోయింది!

ఆస్ట్రియాలో జరిగిన ఒక విషాద ఘటన అందరినీ కలిచివేస్తోంది. సరదాగా ప్రియుడితో కలిసి ట్రెక్కింగ్‌కు వెళ్లిన కెర్ స్టిన్ గుర్ ట్నర్ (33) అనే యువతి, మంచు కొండల్లో ఒంటరిగా గడ్డకట్టి ప్రాణాలు కోల్పోయింది. దేశంలోనే ఎత్తైన ‘గ్రాస్ గ్లోక్నర్’ పర్వతాన్ని ఎక్కడానికి వెళ్లిన ఆమెను, అనుభవజ్ఞుడైన పర్వతారోహకుడు, తన బాయ్‌ఫ్రెండ్ థామస్ ప్లాంబెర్గర్ (39) రక్షణ లేకుండా వదిలేసి రావడం వల్లే ఈ ఘోరం జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో తనను తాను “వింటర్ చైల్డ్”గా చెప్పుకునే ఆమెకు చివరకు ఆ మంచే సమాధి కట్టింది.

అసలేం జరిగిందంటే.. ఈ జంట ప్లాన్ చేసుకున్న టైమ్ కంటే రెండు గంటలు ఆలస్యంగా యాత్ర మొదలుపెట్టింది. పైన మైనస్ 20 డిగ్రీల చలి, భయంకరమైన గాలులు వీస్తున్నాయి. శిఖరాగ్రానికి కేవలం 150 అడుగుల దూరంలో ఉండగా కెర్ స్టిన్ అలసిపోయి, స్పృహ కోల్పోయే స్థితికి చేరుకుంది. ఆ సమయంలో ఆమెకు రక్షణ కల్పించాల్సిన థామస్, తెల్లవారుజామున 2 గంటల సమయంలో సాయం కోసం వెళ్తున్నానని చెప్పి ఆమెను అక్కడే వదిలేశాడు.

కనీసం ఆమె దగ్గర ఉన్న ఎమర్జెన్సీ బ్లాంకెట్లు గానీ, రక్షణ కవర్లు గానీ కప్పకుండా వెళ్లాడని ప్రాసిక్యూటర్లు ఆరోపిస్తున్నారు. కిందకు వెళ్లాక కూడా రెస్క్యూ టీమ్‌కు ఫోన్ చేయడానికి గంటల సమయం తీసుకున్నాడని, ఆ తర్వాత ఫోన్ సైలెంట్‌లో పెట్టడంతో వాళ్లు తిరిగి ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదని తెలిసింది. వాతావరణం బాగోలేక రెస్క్యూ టీమ్ ఉదయం వెళ్లేసరికి ఆమె విగతజీవిగా మారింది.

ఈ ఘటనలో థామస్ నిర్లక్ష్యమే ఆమె మరణానికి కారణమని పోలీసులు కేసు నమోదు చేశారు. నేరం రుజువైతే అతనికి మూడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అయితే ఇది అనుకోకుండా జరిగిన ప్రమాదం అని అతని లాయర్ వాదిస్తున్నారు. మరోవైపు కెర్ స్టిన్ మరణంతో ఆమె కుటుంబం, స్నేహితులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆమె కోసం ఆన్‌లైన్‌లో ఏర్పాటు చేసిన మెమోరియల్ పేజీలో నివాళుల వెల్లువ కురుస్తోంది. పర్వతారోహణలో అనుభవం ఉన్నవాడు కాబట్టి, ఆమె బాధ్యత పూర్తిగా అతనిదే అని అధికారులు అంటున్నారు. ఆమెను అలా వదిలేయడం వల్లే చనిపోయిందని వాదిస్తున్నారు.