పలుమార్లు కరెంట్ బిల్లు చూసి సామాన్యుడికి షాక్ కొట్టడం కామనే. కానీ త్వరలో ఈ టెన్షన్ తగ్గబోతోంది. మన కరెంట్ బిల్లుల భారం తగ్గించడానికి ప్రభుత్వం ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయం తీసుకోబోతోంది. టెక్నాలజీని వాడి విద్యుత్ రంగంలో జరుగుతున్న నష్టాలను అరికట్టి, ఆ లాభాన్ని జనాలకు బదిలీ చేయాలని సెంటర్ ప్లాన్ చేస్తోంది.
కరెంట్ బిల్లులు ఎక్కువగా ఉండటానికి అసలు కారణం కరెంట్ దొంగతనాలు, సప్లైలో వచ్చే నష్టాలు. చాలా చోట్ల వైర్లు వేసి దొంగతనంగా కరెంట్ వాడేస్తుంటారు. దీనివల్ల కంపెనీలకు వచ్చే నష్టాన్ని, మన బిల్లుల్లో వేసి వసూలు చేస్తారు. ఇప్పుడు ఏఐ టెక్నాలజీతో ఈ దొంగతనాలను ఇట్టే పసిగట్టవచ్చు. ఎక్కడైనా తేడాగా కరెంట్ వాడుతున్నా, రీడింగ్లో మార్పులు ఉన్నా సాఫ్ట్వేర్ వెంటనే అధికారులకు అలర్ట్ పంపిస్తుంది.
దొంగతనాలు ఆగితే కంపెనీల నష్టాలు తగ్గుతాయి, ఆటోమేటిక్గా మన బిల్లులు తగ్గుతాయి. కేవలం దొంగతనాలు ఆపడమే కాదు, కరెంట్ సప్లై సిస్టమ్ను ఆటోమేట్ చేయడానికి పెద్ద పెద్ద టెక్నాలజీలను (GPT మోడల్స్) వాడనున్నారు. ఎక్కడ డిమాండ్ ఎంత ఉంది, ఎప్పుడు సప్లై పెంచాలి అనే నిర్ణయాలు ఫాస్ట్గా తీసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.
ఇక అక్టోబర్లో కేంద్రం తీసుకొచ్చిన కొత్త ఎలక్ట్రిసిటీ బిల్లు 2025 కూడా గేమ్ చేంజర్ కానుంది. ఇప్పటివరకు కరెంట్ సప్లై అంటే ప్రభుత్వానిదే ఆధిపత్యం. కానీ ఈ కొత్త బిల్లుతో ప్రైవేట్ కంపెనీలు కూడా రంగంలోకి వస్తాయి. టెలికాం రంగంలో జియో, ఎయిర్టెల్ పోటీ పడితే మనకు ఆఫర్లు ఎలా వచ్చాయో, ఇక్కడ కూడా పోటీ పెరిగి రేట్లు తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. అయితే రైతులకు, పేదలకు ఇచ్చే సబ్సిడీలకు మాత్రం ఎలాంటి ఢోకా ఉండదని ప్రభుత్వం చెబుతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates