చైనా మరో అద్భుతాన్ని సృష్టించింది. గుయిజౌ ప్రావిన్స్లో హుజియాంగ్ గ్రాండ్ క్యానియన్ వంతెనను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. 625 మీటర్ల ఎత్తులో నిలిచిన ఈ వంతెన ప్రస్తుతం ప్రపంచంలోనే ఎత్తైన వంతెనగా గుర్తింపు పొందింది. రెండు గంటలు పట్టే ప్రయాణాన్ని కేవలం రెండు నిమిషాలకు తగ్గించడం దీని గొప్పతనం. సెప్టెంబర్ 28న అధికారికంగా ప్రారంభమైన ఈ వంతెన ప్రారంభోత్సవానికి స్థానిక ప్రజలు, ఇంజినీర్లు, అధికారులు భారీగా హాజరయ్యారు.
మొత్తం 2,900 మీటర్ల పొడవు కలిగిన ఈ వంతెనలో మొత్తం స్పాన్ 1,420 మీటర్లు. ఇది 625 మీటర్ల ఎత్తులో బీపాన్ నదిపై నిలవడం ప్రత్యేకం. వంతెన నిర్మాణ సమయంలో ఎదురైన కఠిన పరిస్థితులు, లోతైన లోయలు, బలమైన గాలులు, ఉష్ణోగ్రత నియంత్రణ వంటి సవాళ్లను అధిగమించి నిర్మాణ బృందం ముందుగానే పనులు పూర్తి చేసింది. ఈ ప్రాజెక్టును గుయిజౌ ట్రాన్స్పోర్టేషన్ ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ నిర్వహించింది.
ప్రారంభానికి ముందు వంతెన భద్రతపై విస్తృత పరీక్షలు చేపట్టారు. మొత్తం 96 ట్రక్కులను వంతెనపై ఉంచి లోడ్ టెస్టులు చేశారు. 400కుపైగా సెన్సర్లు వంతెనలోని ప్రధాన భాగాలను మానిటర్ చేశాయి. కేబుల్స్, టవర్స్, స్పాన్లపై చిన్నపాటి మార్పులు జరిగినా గుర్తించడానికి ఈ టెస్టులు సహాయపడ్డాయి. అన్ని పరీక్షలు విజయవంతంగా పూర్తవడంతో వంతెనను ప్రారంభించేందుకు అనుమతి లభించింది.
ఈ వంతెన రవాణా సౌకర్యం మాత్రమే కాకుండా టూరిజం ఆకర్షణగా కూడా నిలుస్తోంది. 207 మీటర్ల ఎత్తైన సైట్సీయింగ్ ఎలివేటర్, ఆకాశంలో కేఫేలు, వ్యూయింగ్ ప్లాట్ఫారమ్లు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా ప్రయాణికులు కిందనున్న లోయ అద్భుత దృశ్యాలను ఆస్వాదించవచ్చు. ఇప్పటికే డ్రోన్ చిత్రాలు, లైవ్ వీడియోలు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి.
ఈ వంతెన ప్రారంభం వల్ల స్థానిక రవాణా వ్యవస్థకు ఊపిరి పోసుకోవడంతో పాటు పర్యాటక రంగానికీ భారీ లాభం కలిగే అవకాశం ఉంది. చైనా ప్రస్తుతం ప్రపంచంలోనే అగ్రగామి వంతెన నిర్మాణ దేశంగా నిలుస్తోంది. ప్రపంచంలో ఉన్న టాప్ 10 ఎత్తైన వంతెనల్లో ఎనిమిది చైనాలోనే ఉండగా, వాటిలో ఎక్కువ భాగం గుయిజౌ ప్రావిన్స్లో ఉన్నాయి. ఇప్పుడు హుజియాంగ్ గ్రాండ్ క్యానియన్ వంతెన ప్రారంభం మరో రికార్డు జోడించింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates