అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఔషధ దిగుమతులపై 100 శాతం టారిఫ్లు విధించనున్నట్లు ప్రకటించడం అంతర్జాతీయ ఫార్మా పరిశ్రమలో చర్చనీయాంశమైంది. అయితే ఈ నిర్ణయం భారత ఔషధ కంపెనీలపై అంతగా ప్రభావం చూపదని నిపుణులు చెబుతున్నారు. ప్రధాన కారణం, భారత్ నుంచి అమెరికాకు వెళ్తున్న ఔషధాలు ఎక్కువగా జనరిక్ రూపంలో ఉండటమే. ట్రంప్ ప్రకటించిన టారిఫ్లు పేటెంట్ లేదా బ్రాండెడ్ ఔషధాలకే వర్తించనున్నాయి.
భారతీయ ఫార్మాస్యూటికల్ అలయన్స్ (IPA) స్పష్టంగా తెలిపింది. భారత్ నుంచి ఎగుమతి అవుతున్న ఔషధాలలో దాదాపు 80 శాతం జనరిక్స్ అని, కాబట్టి ఈ నిర్ణయానికి పెద్దగా ప్రభావం ఉండదని పేర్కొంది. ముఖ్యంగా డాక్టర్ రెడ్డీస్, సన్ఫార్మా, లుపిన్, జైడస్ లైఫ్సైన్సెస్ వంటి దిగ్గజ కంపెనీలు అమెరికా మార్కెట్లో స్థిరమైన స్థానం సంపాదించుకున్నాయి. ఇవి ఇప్పటికే అక్కడ తయారీ యూనిట్లు, రీప్యాకింగ్ సెంటర్లు ఏర్పాటు చేయడంతో అదనపు రక్షణ కలిగింది.
అమెరికాకు అవసరమయ్యే ఔషధాల్లో 47 శాతం భారత్ నుంచే వస్తున్నాయి. చౌకగా, నాణ్యంగా అందించే భారత జనరిక్ మందులు అమెరికా ఆరోగ్యరంగానికి పెద్ద ఉపశమనం కలిగిస్తున్నాయి. 2022లో మాత్రమే భారత జనరిక్ మందుల వలన అమెరికా 219 బిలియన్ డాలర్ల ఖర్చు తగ్గించుకోగలిగింది. 2013 నుంచి 2022 వరకు మొత్తం ఆదా అయిన మొత్తం 1.3 ట్రిలియన్ డాలర్లకు చేరిందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో, అమెరికాకు భారత్ నుంచి జరిగే ఎగుమతులు కొనసాగుతాయని పరిశ్రమ నమ్ముతోంది.
ఫార్మాసిల్ ఛైర్మన్ నమిత్ జోషి కూడా ఇదే విషయాన్ని పునరుద్ఘాటించారు. ట్రంప్ ప్రకటించిన 100 శాతం టారిఫ్లు కేవలం పేటెంట్, బ్రాండెడ్ మందులకే వర్తిస్తాయని, జనరిక్ ఔషధాలకు ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పారు. ఇప్పటికే భారత కంపెనీలు అమెరికాలో ప్లాంట్లు నెలకొల్పి వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నాయని గుర్తు చేశారు. అయితే భవిష్యత్లో పాలసీ మార్పులు వస్తే వాటికి అనుగుణంగా వ్యూహాలు సిద్ధం చేసుకోవాలని సూచించారు.
అయినా కూడా పరిశ్రమ జాగ్రత్త అవసరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికా ఫార్మా పాలసీలలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకోవచ్చు. బ్రాండెడ్ ఔషధాల దిగుమతులపై టారిఫ్లు పెట్టినట్లే భవిష్యత్లో ఇతర విభాగాలను కూడా ప్రభావితం చేసే విధానాలు తీసుకురావచ్చు. అలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు భారత కంపెనీలు సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందని వారు అంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates