ఇండియా విన్… పాకిస్థాన్ టీవీ స్టూడియోలో రేర్ సీన్

భారత్, పాకిస్థాన్ మధ్య వైరం గత ఏడాది కాలంలో ఎంత తీవ్ర స్థాయికి చేరుకుందో తెలిసిందే. పరస్పరం ద్వేష భావం పెరిగిపోయి.. ఒకరి మీద ఒకరు విషం చిమ్ముకునే పరిస్థితి వచ్చింది. సందర్భం ఏదైనా సరే.. అవతలి వాళ్లను కొనియాడే పరిస్థితి ఎంతమాత్రమూ లేదు. ఇండియన్స్.. పాకిస్థాన్‌‌ను అన్ని విషయాల్లోనూ లైట్ తీసుకుంటూ ఆ దేశం గురించి మాట్లాడ్డమే తగ్గించేశారు.

కానీ పాకిస్థాన్ వాళ్లకు ఇండియా మీద ఏడవడం మామూలైపోయింది. ఆటలో అయినా.. ఇంకో రంగంలో అయినా.. ఇండియాది స్పష్టమైన పైచేయి అవుతుండడమే అందుక్కారణం. టీ20 ప్రపంచకప్ ఆరంభమైన దగ్గర్నుంచి రకరకాల కారణాలతో ఇండియా మీద పాకిస్థానీలు విషం చిమ్ముతూనే ఉన్నారు. అక్కడి టీవీ స్టూడియోల్లో మాజీ క్రికెటర్లు.. ఇండియాను విమర్శించడం కామన్ వ్యవహారం అయిపోయింది. అలాంటిది ఇప్పుడు ఇండియా ప్రపంచకప్ గెలిచేసరికి సీన్ మారింది.

ఒక పాకిస్థాన్ టీవీ స్టూడియోలో అరుదైన దృశ్యం చోటు చేసుకుంది. పాకిస్థాన్ లెజెండరీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్.. కప్పు గెలిచిన ఇండియన్ టీంనే కాక.. బీసీసీఐని ప్రశంసల్లో ముంచెత్తాడు. స్టూడియోలో ఉన్న న్యూస్ ప్రెజెంటర్, గెస్ట్‌లుగా వచ్చిన ఇతర క్రికెటర్లు గప్‌చుప్‌మని ఉండగా.. షోయబ్ మాత్రం భారత క్రికెట్ జట్టు మీద ప్రశంసల జల్లు కురిపించాడు.

నిన్న గెలిచింది కేవలం భారత జట్టు మాత్రమే కాదని.. ఇండియా పాలసీ గెలిచిందని, సిస్టమ్ గెలిచిందని, మెరిట్ గెలిచిందని షోయబ్ కొనియాడాడు. భారత్‌లో క్రికెట్ వ్యవస్థ ఎంతో గొప్పగా ఉందని.. దేశవాళీ క్రికెట్‌ను పకడ్బందీగా నిర్వహిస్తారని.. స్టేడియాలు, క్రికెట్ సౌకర్యాలు మెరుగుపరిచేందుకు ఎంతో ఖర్చు పెడతారని.. యువ క్రికెటర్లకు మంచి ప్రోత్సాహం దక్కుతుందని షోయబ్ అన్నాడు.

జట్టు ఎంపిక విషయంలోనూ ఎంతో పారదర్శకంగా వ్యవహరిస్తారని.. మెరిట్ ఆధారంగానే ఎవ్వరినైనా ఆడిస్తారని.. సంజు శాంసన్ ఫామ్‌లో లేనపుడు అతణ్ని పక్కన పెట్టారని.. మళ్లీ జట్టుకు అవసరమైనపుడు ఆడిస్తే అతను గొప్ప ప్రదర్శన చేశాడని షోయబ్ వ్యాఖ్యానించాడు. ఇలా మెరిట్ ఆధారంగా ఆటగాళ్లను ఆడించే సిస్టమ్ ఉండడం గొప్ప విషయం అని షోయబ్ పేర్కొన్నాడు. షోయబ్ ఇలా మాట్లాడుతున్నంతసేపు స్టూడియోలో నిశ్శబ్దం ఆవహించడం గమనార్హం.