విజయవాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)లో పీజీ వైద్య విద్యార్థిని బత్తుల దీపిక ఆత్మహత్య కేసులో కీలక మలుపు తిరిగింది. ఈ ఘటనకు సంబంధించి నందిగామ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ అమర్ సహస్ను ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ప్రేమ వ్యవహారం, వివాహం విషయంలో జరిగిన విభేదాలే ఈ విషాదానికి కారణమయ్యాయని దర్యాప్తులో వెల్లడైంది.
పోలీసుల వివరాల ప్రకారం, అనంతపురం మెడికల్ కాలేజీలో అనస్థీషియాలజీ విభాగంలో పీజీ చదువుతున్న దీపిక విజయవాడ జీజీహెచ్లో విధులు నిర్వర్తిస్తోంది. గత నెల ఫిబ్రవరి 5న ఆసుపత్రి గదిలో ప్రమాదకర ఇంజెక్షన్ తీసుకుని ఆమె కుప్పకూలింది. వెంటనే సహచర వైద్యులు చికిత్స అందించినప్పటికీ ఆమె ప్రాణాలు దక్కలేదు. ఈ ఘటనపై అనుమానం వ్యక్తం చేసిన దీపిక తల్లిదండ్రులు మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
దర్యాప్తులో భాగంగా పోలీసులు దీపిక మొబైల్ ఫోన్ కాల్ డేటాను పరిశీలించారు. ఫిబ్రవరి 4 అర్ధరాత్రి సుమారు 12.30 గంటల సమయంలో దీపిక, అమర్ సహస్ మధ్య సుమారు తొమ్మిది నిమిషాలపాటు ఫోన్ సంభాషణ జరిగినట్లు గుర్తించారు. గత కొంతకాలంగా ఇద్దరి మధ్య ప్రేమ సంబంధం ఉన్నట్లు, అయితే ఇటీవల అమర్ మరో యువతితో వివాహానికి సిద్ధమవడంతో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తినట్లు పోలీసులు గుర్తించారు. అదే కారణంగా దీపిక తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
ఈ నేపథ్యంలో అమర్ సహస్ దీపికను ఆత్మహత్యకు ప్రేరేపించాడనే ఆరోపణలపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) 2023లోని సెక్షన్ 108 కింద కేసు నమోదు చేసి అతన్ని అరెస్టు చేసినట్లు సెంట్రల్ జోన్ ఏసీపీ కే. దామోదర్ తెలిపారు. కేసుకు సంబంధించి మరిన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates