గ్యాస్ లేక రెస్టారెంట్లు బంద్..కేంద్రం కీలక నిర్ణయం

ఇరాన్ పై ఇజ్రాయెల్-అమెరికా చేస్తున్న యుద్ధం ప్రభావం భారత్ తోపాటు పలు దేశాలపై పడిన సంగతి తెలిసిందే. పశ్చిమాసియాలోని అనిశ్చిత వాతావరణం ప్రభావం ముఖ్యంగా చమురు, గ్యాస్ దిగుమతులపై తీవ్రంగా ఉంది. ఈ క్రమంలోనే భారత్ లో ఎల్పీజీ కొరత ఏర్పడింది. కమర్షియల్ సిలెండర్ల ధర 115 రూపాయలు పెరగడంతో పాటు సరఫరా కూడా నిలిచిపోయింది. దీంతో, బెంగళూరు, చెన్నై, ముంబైలలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లపై తీవ్ర ప్రభావం పడింది.

ఆ నగరాల్లోని 20 శాతం హోటళ్లు, రెస్టారెంట్లు గ్యాస్ లేక మూతబడ్డాయి. అంతేకాదు, కమర్షియల్ గ్యాస్ సిలెండర్ల సప్లై ఇలాగే ఉంటే మరో రెండ్రోజుల్లో 50 శాతం రెస్టారెంట్లు, హోటళ్లు మూతబడే అవకాశముంది. దీంతో, హోటల్స్‌ సిబ్బందితోపాటు వాటిపై ఆధారపడిన ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో, గృహావసరాలకు వినియోగించే సిలెండ్లరను బ్లాక్ లో కొని కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లు నెట్టుకొస్తున్నాయని తెలుస్తోంది.

మరోవైపు, ఎల్పీజీ, పెట్రోల్, డీజిల్ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. చమురు శుద్ధి సంస్థలపై కేంద్ర ప్రభుత్వం ఎస్మా ప్రయోగించింది. ఆయా సంస్థలు పెట్రోల్, డీజీల్, ఎల్పీజీల కృత్రిమ కొరత సృష్టించకుండా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంటూ గజిట్ విడుదల చేసింది.

అదే సమయంలో, గ్యాస్ కొరత, సరఫరాలో ఇబ్బందులపై అధ్యయనం కోసం ఒక కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ రోజు జరిగే కేంద్ర కేబినెట్ భేటీలో పెరిగిన వంట గ్యాస్ ధరల పై కూడా కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది.

ఈ గ్యాస్ సంక్షోభాన్ని అధిగమించేందుకు కేంద్రం ప్రత్యామ్నాయ ఏర్పాట్లను పరిశీలిస్తుంది. అల్జీరియా, ఆస్ట్రేలియా, కెనడా, నార్వే, యూఏఈ తదితర దేశాల నుంచి ఎల్పీజీని కొనుగోలు చేసేందుకు కేంద్రం సంప్రదింపులు జరుపుతోందని తెలుస్తోంది.