అవును.. ఒక లారీ డ్రైవర్ చేసిన పని గురించి తెలిసిన వారంతా అవాక్కు అవుతున్నారు. నమ్మకాలకు ఎంత ప్రాధాన్యతను ఇస్తారన్న విషయం అతడి చర్యతో మరోసారి స్పష్టమవుతుందని చెప్పాలి. తాను కోరుకున్న కోరికను తీర్చేందుకు మొక్కు కోసం ఏకంగా 151 మేకల్ని బలి ఇచ్చేసిన వైనం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. తమిళనాడులో చోటు చేసుకున్న ఈ ఉదంతంలోకి వెళితే..
ధర్మపురి జిల్లాలోని అత్తిమరత్తూర్ గ్రామానికి చెందిన తంగరాజ్ ఒక లారీ డ్రైవర్. అతడికి భార్య హంస.. ఒక కొడుకు ఉన్నాడు. ఆరేళ్ల క్రితం తంగరాజ్ అనారోగ్యం బారిన పడ్డాడు. ఎన్ని ఆసుపత్రులకు వెళ్లినా.. ఎందరు వైద్యులకు చూపించినా అతడి అనారోగ్యం మాత్రం తగ్గలేదు. మామూలు మనిషి కాలేదు. దీంతో మరింత కుంగుబాటుకు గురయ్యాడు.
ఇలాంటి వేళ.. పెన్నాగరం సమీపంలోని బి.అగ్రహారంలో ఉన్న మారియమ్మన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి.. మొక్కు తీసుకుంటే.. తప్పకుండా అనుకున్న పని పూర్తి అవుతుందని చెప్పిన మాటల్ని నమ్మాడు. అందుకు తగ్గట్లే..ఆ అమ్మవారి గుడికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించి తన ఆరోగ్యం గురించి మొక్కుకున్నాడు. తన అనారోగ్యం కుదుట పడి.. మళ్లీ మామూలుగా అయితే 151 మేకల్ని బలి ఇస్తానని మొక్కుకున్నాడు.
అమ్మవారి మొక్కు తర్వాత.. కొద్ది రోజులకే అతడి ఆరోగ్యం కుదుటపడింది. మామూలు మనిషి అయ్యాడు. దీంతో.. అమ్మవారికి ఇచ్చిన మాటకు తగ్గట్లే తాజాగా రూ.10 లక్షలు ఖర్చుచేసి 151 మేకల్ని కొనుగోలు చేశాడు. మంగళవారం అమ్మవారి ఆలయ ప్రాంగణానికి తీసుకొచ్చి.. అమ్మవారికి బలి ఇచ్చాడు. గుడికి వచ్చిన భక్తులకు మాంసాహారంతో విందు ఇచ్చాడు. ఇంత భారీ ఎత్తున మేకల్ని బలి ఇచ్చిన వైనం స్థానికంగా సంచలనంగా మారింది. లారీ డ్రైవర్ వ్యవహారం హాట్ టాపిక్ అయ్యింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates