నేపాల్‌లో ‘నెపో కిడ్స్’ విలాసాలు.. విధ్వంసానికి కారణమా?

నేపాల్‌ రాజకీయ పరిస్థితులు రోజురోజుకీ మరింత దారుణంగా మారిపోతున్నాయి. గత వారం ప్రారంభమైన నిరసనలు ఇప్పుడు దేశవ్యాప్త ఉద్యమంగా మారాయి. ముఖ్యంగా జెన్‌ జడ్‌ (Gen-Z) తరం ఆధ్వర్యంలో సాగుతున్న ఈ ఆందోళనలు ఇప్పటికే తీవ్రమైన పరిణామాలకు దారితీశాయి. పోలీసులు చేసిన కాల్పులు, టియర్‌ గ్యాస్‌ దాడుల్లో 31 మంది మృతి చెందగా, వెయ్యికి పైగా గాయపడ్డారు. ఈ కల్లోలం మధ్య ప్రధాని కె.పి. శర్మ ఓలి తన పదవికి రాజీనామా చేశారు.

ప్రజల్లోని అసహనం వెనుక ప్రధాన కారణం అవినీతి, అసమానతలు. ఒకవైపు నిరుద్యోగం, పెరుగుతున్న ధరలు, పేదరికంతో ఇబ్బందులు పడుతున్న సాధారణ నేపాలీలు.. మరోవైపు రాజకీయ నాయకుల పిల్లలు విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని బహిర్గతమైన వీడియోలు ప్రజల్లో ఆగ్రహానికి దారితీశాయి. టిక్‌టాక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఎక్స్‌ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్‌ అవుతున్న ఈ వీడియోల్లో లగ్జరీ కార్లు, కోట్ల రూపాయల బ్యాగులు, విలాసవంతమైన విదేశీ పర్యటనలు కనిపించాయి.

అందులో మాజీ ఆరోగ్యశాఖ మంత్రి బీరోధ్‌ ఖటీవాడ కుమార్తె, మాజీ మిస్‌ నేపాల్‌ శృంఖల ఖటీవాడ పేరు బాగా వినిపించింది. ఆమె విలాసవంతమైన జీవనశైలిని చూపించే వీడియోలు పెద్ద ఎత్తున వైరల్‌ అయ్యాయి. ఆమె కుటుంబ ఇల్లు నిరసనకారుల కోపానికి గురై దహనం చేయబడింది. అలాగే మాజీ ప్రధాని షేర్‌ బహదూర్‌ డియుబా కోడలు శివానా శ్రేష్ఠ, ప్రఖ్యాత కమ్యూనిస్ట్‌ నేత ప్రచండ మనవరాలు స్మితా దహాల్‌ కూడా విలాసవంతమైన వస్తువులను ప్రదర్శిస్తూ ప్రజల విమర్శలకు గురయ్యారు.

న్యాయశాఖ మంత్రి బిందు కుమార్‌ థాపా కుమారుడు సౌగత్‌ థాపా ఫొటోలు కూడా సోషల్ మీడియాలో విస్తరించాయి. పేదలు ఆహారం కోసం కష్టపడుతున్న సమయంలో రాజకీయ కుటుంబాలు కోట్ల విలువైన జీవితం గడుపుతున్నారన్న ఆగ్రహం నిరసనలను మరింత భగ్గుమనిపించింది. ఫలితంగా ఖాట్మాండు సహా పలు నగరాల్లో రాజకీయ నాయకుల ఇళ్ళు, హోటళ్ళు మంటలలో కాలి బూడిదయ్యాయి.

ఇకపోతే, ఈ నిరసనల వెనుక అవినీతి కుంభకోణాలే ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. తాజాగా పార్లమెంటరీ విచారణలో పోఖరా అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంలో 71 మిలియన్‌ డాలర్లు అవినీతికి గురయ్యాయని బయటపడింది. అలాగే శరణార్థుల కోటాలను విక్రయించిన ఘటనల్లో కూడా రాజకీయ నాయకులు ప్రమేయం ఉన్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ అవినీతిని కప్పిపుచ్చేందుకే సోషల్ మీడియాను బ్లాక్‌ చేశారని ప్రజలు భావిస్తున్నారు.

ప్రస్తుతం నేపాల్‌లో ప్రభుత్వమే లేని పరిస్థితి ఏర్పడింది. పార్లమెంట్‌ భవనం మంటల్లో కాలి బూడిదవ్వగా, ఆర్మీ కర్ఫ్యూ విధించింది. వీధుల్లో సైన్యం పహారా కాస్తోంది. అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్‌ శాంతిని కాపాడాలని పిలుపునిచ్చినా, జెన్‌ జడ్‌ యువత మాత్రం “ఇది మా తరం పోరాటం” అంటూ వెనక్కి తగ్గడం లేదు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ పోరాటం నేపాల్‌ భవిష్యత్తును ఏ దిశగా నడిపిస్తుందో వేచి చూడాల్సిందే.