భారత ఆర్థిక వ్యవస్థలో కీలకమైన మార్పులు రాబోతున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగబోతోంది. ఈసారి ప్రధాన ఎజెండా.. జీఎస్టీ స్లాబ్లను సరళీకరించడం. ఇప్పటివరకు ఉన్న 5%, 12%, 18%, 28% స్లాబ్ల బదులుగా కేవలం రెండు రేట్లే ఉండేలా ప్రతిపాదన వచ్చింది. అంటే, 5% – 18% మాత్రమే ఉండి, ఎక్కువ శాతం వస్తువులు ఈ రెండు కేటగిరీల్లోకి వస్తాయి.
ఇకపోతే, ఇప్పటివరకు 28% పన్ను వేసిన 90% వస్తువులు 18% స్లాబ్కి మారబోతున్నాయి. అలాగే, 12% ఉన్న వస్తువులలో కొంత భాగం 5%కి వచ్చే అవకాశముంది. దీంతో, ముఖ్యంగా మధ్యతరగతి వినియోగదారులపై భారమయ్యే పన్నులు తగ్గుతాయి. రోజువారీ అవసరాల వస్తువులు చవక అవుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రభుత్వం ఈ మార్పుల వల్ల దాదాపు రూ.50,000 కోట్లు ఆదాయ నష్టం చూడాల్సి ఉంటుందని అంచనా.
ఈ కొత్త మార్పులతో జీవన బీమా, ఆరోగ్య బీమా వంటి రంగాలను కూడా జీఎస్టీ నుంచి మినహాయించాలన్న ప్రతిపాదన ఉంది. ప్రస్తుతం ఇవి 18% పన్ను కిందకి వస్తున్నాయి. మరోవైపు, తంబాకు, లగ్జరీ కార్లు, మద్యం వంటి వాటిపై 40% ‘సిన్ ట్యాక్స్’ పెట్టాలని భావిస్తున్నారు. ఆరోగ్య సెస్, గ్రీన్ ఎనర్జీ సెస్ రూపంలో కొత్త పన్నులు కూడా చర్చకు రానున్నాయి.
ఈ మార్పులు ట్రంప్ విధించిన 50% టారిఫ్ ప్రభావాన్ని కొంతవరకు తగ్గిస్తాయని నిపుణుల అంచనా. అమెరికాకు భారతదేశం నుంచి ఎగుమతి అవుతున్న $48 బిలియన్ విలువైన వస్తువులపై ఈ టారిఫ్లు పెద్ద సమస్యగా మారుతున్నాయి. ఇకపోతే జీఎస్టీ రీఫార్మ్స్, ఆదాయ పన్ను తగ్గింపులు కలిపి వినియోగాన్ని రూ.5.31 లక్షల కోట్ల వరకూ పెంచుతాయని ఎస్బీఐ రీసెర్చ్ రిపోర్ట్ చెబుతోంది. ఇది జీడీపీపై 1.6% ప్రభావం చూపనుంది.
అయితే ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు మాత్రం జీఎస్టీ స్లాబ్ మార్పులను సానుకూలంగా చూడడం లేదు. పన్ను ఆదాయం తగ్గుతుందని, దానికి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. తమిళనాడు, పంజాబ్, బెంగాల్ రాష్ట్ర ఆర్థిక మంత్రులు ఈ విషయంపై స్పష్టమైన ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. మొత్తానికి, వినియోగదారులకు ఊరట కలిగించే ఈ కొత్త రూల్స్ ప్రభుత్వానికి ఆర్థిక సవాళ్లు తెచ్చిపెట్టబోతున్నాయనే సంకేతాలు వస్తున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates