ఐఫోన్ తయారీ దిగ్గజం యాపిల్ భారత్లో తన వ్యాపారాన్ని వేగంగా విస్తరిస్తోంది. ఈ క్రమంలోనే సంస్థ తాజాగా బెంగళూరులో 2.7 లక్షల చదరపు అడుగుల కార్యాలయాన్ని అద్దెకు తీసుకుంది. ఇది కేవలం సాధారణ లీజు ఒప్పందం కాదు, పదేళ్లలో యాపిల్ చెల్లించబోయే అద్దె మొత్తం చూసి దేశంలోని రియల్ ఎస్టేట్ రంగం సైతం ఆశ్చర్యపోతోంది. నెలకు రూ.6.3 కోట్ల అద్దెతో మొదలయ్యే ఈ ఒప్పందం, ప్రతి ఏడాది 4.5 శాతం పెరుగుతూ, మొత్తం రూ.1000 కోట్లను తాకనుంది.
ప్రాప్స్టాక్ అనే డేటా అనలిటిక్స్ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఒప్పందం 2025 ఏప్రిల్ 3 నుంచి అమలులోకి వచ్చింది. యాపిల్ అద్దెకు తీసుకున్న స్థలం సాంకేతిక నగరమైన బెంగళూరులోని వ్యూహాత్మక ప్రాంతంలో ఉంది. ఇది సంస్థకు దక్షిణ భారత మార్కెట్ పైన మరింత దృష్టి పెట్టే అవకాశాన్ని ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఐటీ, టెక్ రంగాలకు కేంద్రంగా ఉన్న ఈ నగరంలో యాపిల్ లాంటి గ్లోబల్ కంపెనీ భారీ స్థలాన్ని ఎంచుకోవడం, భారత్లో దీర్ఘకాలిక పెట్టుబడులకు సూచనగా భావిస్తున్నారు.
గత ఆర్థిక సంవత్సరం 2024-25లో భారత్ నుంచి అతి పెద్ద మొబైల్ ఫోన్ ఎగుమతిదారుగా యాపిల్ నిలిచింది. సుమారు రూ.1.5 లక్షల కోట్ల విలువైన ఐఫోన్లను భారత్లో తయారు చేసి విదేశాలకు పంపింది. ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం ద్వారా యాపిల్ ఇప్పటికే ఉత్పత్తి స్థాయిని విస్తరించింది. ఇప్పుడు కార్యాలయ స్థాయిలో కూడా భారీ అడుగు వేసింది. దీంతో రాబోయే రోజుల్లో యాపిల్ భారత్ను కీలక ఉత్పత్తి కేంద్రంగా మార్చబోతుందనే అంచనాలు మరింత బలపడుతున్నాయి.
అద్దె మొత్తం మాత్రమే కాకుండా, ఈ ఒప్పందం బెంగళూరులోని రియల్ ఎస్టేట్ మార్కెట్పై పెద్ద ప్రభావం చూపనుంది. అంతర్జాతీయ కంపెనీలు భారీ స్థలాలను ఎంచుకోవడానికి బెంగళూరు మళ్లీ ప్రధాన గమ్యస్థానంగా మారిందని విశ్లేషకులు చెబుతున్నారు. యాపిల్ నిర్ణయం తర్వాత మరిన్ని టెక్ కంపెనీలు కూడా ఇలాంటి పెట్టుబడులకు అడుగులు వేయవచ్చని అంచనా.
Gulte Telugu Telugu Political and Movie News Updates