రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. శోభ (25), విమ్లా (23) ఇద్దరూ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. శనివారం వేర్వేరు యువకులతో వీరి వివాహం జరగాల్సి ఉంది. శుక్రవారం రాత్రి వరకు పెళ్లి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
శనివారం తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో ఇద్దరూ అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురైనట్లు సమాచారం. కుటుంబ సభ్యులు సమీప ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, అక్కడికి చేరుకునేలోపే వారు మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు. విషపదార్థం సేవించడం వల్ల మృతి చెందినట్లు పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. అయితే పోస్టుమార్టం నివేదిక అనంతరం మాత్రమే కచ్చితమైన కారణం వెల్లడవుతుందని అధికారులు తెలిపారు. ఘటనాస్థలంలో ఎటువంటి ఆత్మహత్యా లేఖ లభించలేదని సమాచారం.
బాధితుల మేనమామ జస్వంత్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తూ బలవంతపు పెళ్లి కారణంగా ఈ ఘటన జరిగి ఉండవచ్చని ఆరోపించారు. గతంలో కుదిరిన సంబంధాలను రద్దు చేసి కుటుంబ పెద్దల ఒత్తిడితో పోఖ్రాన్ ప్రాంతానికి చెందిన వ్యక్తులతో పెళ్లి నిశ్చయించారని పేర్కొన్నారు. ఆ ఒత్తిడి కారణంగానే ఈ దుర్ఘటన జరిగి ఉండవచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే అంత్యక్రియలకు సిద్ధమవుతుండగా సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం తరలించారు. అసహజ మృతి కేసు నమోదు చేసి పలు కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వెలువడిన తర్వాతే అసలు కారణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates