ఇండియా ముందుకు వెళ్లాలంటే?

టీ20 ప్రపంచకప్‌లో మొన్నటిదాకా భారత జట్టు టైటిల్‌కు హాట్ ఫేవరెట్. గ్రూప్ దశలో ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ గెలిచింది. మొత్తం అన్ని జట్లలో అత్యధిక నెట్ రన్‌రేట్‌ను నమోదు చేసింది. టోర్నీ జరుగుతున్నది ఇండియాలో. ఆస్ట్రేలియా లాంటి పెద్ద జట్టు గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. దీంతో ఇక కప్పు మనదే అని ధీమాతో ఉన్నారు అభిమానులు.

కానీ ఆదివారం భారత జట్టుకే కాదు.. అభిమానులకూ పెద్ద షాక్ తగిలింది. టైటిల్ ఫేవరెట్ అనుకున్న జట్టు ఏకంగా 76 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయింది. బలమైన బ్యాటింగ్ ఉన్న జట్టు కేవలం 111 పరుగులకే ఆలౌట్ కావడం ఫ్యాన్స్ జీర్ణించుకోలేని విషయం. దీంతో మన జట్టు అసలు సెమీస్ చేరుతుందా లేదా అన్న అనుమానాలు మొదలయ్యాయి. ఐతే ఇప్పటికీ భారత్‌కు మంచి ఛాన్సే ఉంది. కాకపోతే సమీకరణాలు కలిసి రావాలి.

ఇక భారత్ కర్తవ్యం.. మిగతా రెండు సూపర్-8 మ్యాచుల్లో జింబాబ్వే, వెస్టిండీస్‌లపై విజయం సాధించడం. ఐతే మామూలుగా గెలిస్తే సరిపోదు. కొంచెం ఘనంగా గెలవాలి. ఎంత ఘనంగా అంటే.. దక్షిణాఫ్రికా చేతిలో భారీ తేడాతో ఓడడం వల్ల మైనస్‌లోకి వెళ్లిపోయిన నెట్ రన్‌రేట్.. ప్లస్సులోకి వచ్చేలా.

పరుగుల పరంగా అయితే 50 పరుగుల తేడాతో గెలవాలి. ఛేజింగ్ అయితే నాలుగైదు ఓవర్లు ఉండగానే విజయం సాధించాలి. ఇది భారత్ చేయాల్సిన పని. మరోవైపు వెస్టిండీస్, జింబాబ్వే జట్లలో ఏదీ రెండు మ్యాచ్‌లు గెలవకపోతే మంచిది. ఒకవేళ గెలిచినా.. నెట్ రన్‌రేట్‌లో భారత్‌ను మించకూడదు.

ఇప్పుడు భారత్‌ను దక్షిణాఫ్రికా దెబ్బ కొట్టినా సరే.. ఆ జట్టు మిగతా రెండు మ్యాచుల్లో వెస్టిండీస్, జింబాబ్వేలను ఓడించాలనే మనం కోరుకోవాలి. అప్పుడే భారత్‌కు లైన్ క్లియర్ అవుతుంది. ముందుగా గురువారం జింబాబ్వేను ఢీకొనబోతోంది. ఆ మ్యాచ్‌లో భారత్ ఘనంగా గెలవాలి. వచ్చే ఆదివారం విండీస్‌తో మ్యాచ్ ఉంది. ఆ మ్యాచ్‌కు ముందే భారత్ ముందంజ వేయాలంటే ఎంత తేడాతో గెలవాలన్నది క్లారిటీ వచ్చేస్తుంది. కాబట్టి అప్పటి వరకు ఏం జరుగుతుందో చూద్దాం.