‘భ‌ర్త సంపాద‌న ఎంతో భార్య‌కు చెప్ప‌క్క‌ర్లేదు’

స‌హ‌జంగా భర్త ఎంత సంపాయిస్తున్నాడో.. ఏం చేస్తున్నాడో.. తెలుసుకునేందుకు భార్య‌లు ఆస‌క్తి చూపుతారు. ఈ విష‌యం తెలుసుకునేందుకు వారు ఉత్సాహం కూడా ప్ర‌ద‌ర్శిస్తారు. కానీ, కొంద‌రు భ‌ర్త‌లు తాము ఎంత సంపాయిస్తున్నామో.. ఎంత జీతం వ‌స్తోందో భార్యలకు చెప్పేందుకు ఇష్ట‌ప‌డ‌రు. దీనినే ఓ భార్య చ‌ట్ట ప‌రంగా స‌వాల్ చేసి.. ఎదురు దెబ్బ‌తిన్నారు. తొలుత ఆమె విజ్ఞ‌ప్తిని రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర్వాత‌.. రాష్ట్ర హైకోర్టు కూడా తిర‌స్క‌రించాయి. భ‌ర్త సంపాద‌న ఎంతో భార్య‌కు చెప్ప‌న‌క్క‌ర్లేద‌ని హైకోర్టు తాజాగా తీర్పు వెలువ‌రించింది.

ఎక్క‌డ.. ఏం జ‌రిగింది?

రాజ‌స్థాన్‌కు చెందిన కాంత కుమావ‌త్‌.. అనే మ‌హిళ భ‌ర్త రాష్ట్ర పోలీసు శాఖ‌లో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే.. ఆమె త‌న ఖ‌ర్చులకు విరివిగా సొమ్ములు ఇవ్వాల‌ని ఆయ‌న‌పై ఒత్తిడి చేసింది. కానీ, త‌న‌కు వ‌స్తున్న జీతంతో ఇంటి అవ‌స‌రాలు స‌రిపోతున్నాయ‌ని.. అద‌న‌పు ఖ‌ర్చుల‌కు ఇవ్వ‌లేన‌ని తెగేసి చెప్పాడు. దీంతో ఇరువురి మ‌ధ్య సంపాద‌న‌కు సంబంధించిన అంశంపై వివాదం చెల‌రేగింది. ఈ క్ర‌మంలో కాంత‌.. రాష్ట్ర హోం శాఖ‌కు స‌మాచార హ‌క్కు చ‌ట్టం కింద ద‌ర‌ఖాస్తు చేసి.. త‌న భ‌ర్త సంపాద‌న వివ‌రాలు కోరింది.

భిల్వారాలో పోలీసు శాఖలో ఉద్యోగం చేస్తున్న తన భర్తకు చెల్లించిన జీతం వివరాలు, పే స్లిప్‌ల కాపీలను ఇవ్వాల‌ని స‌మాచార హ‌క్కు చ‌ట్టం కింద ఆమె స‌ర్కారుకు విన్న‌వించింది. కానీ, వేత‌నం అనేది వ్య‌క్తిగ‌త అంశ‌మ‌ని.. దీనిని మూడో వ్య‌క్తితో పంచుకునేందుకు అవ‌కాశం లేద‌ని.. అలా చెప్ప‌లేమ‌ని రాజ‌స్థాన్ ప్ర‌భుత్వం స‌ద‌రు పిటిష‌న్‌ను తోసిపుచ్చింది. దీంతో కాంత‌.. రాష్ట్ర హైకోర్టును ఆశ్ర‌యించి.. ఇదే విష‌యాన్ని కోరారు.

దీనిపై స్పందించిన రాజ‌స్థాన్ హైకోర్టు.. సమాచార హక్కుచట్టం కింద తన భర్త జీతం వివరాలను పొందకుండా నిరోధించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించింది. “ప్రజా ప్రయోజనం లేని సమయంలో అటువంటి సమాచారాన్ని బహిర్గతం చేయడం వల్ల ఎటువంటి ప్ర‌యోజ‌నం లేదు“ అని కోర్టు పేర్కొంది.

అంతేకాదు.. ఒక వ్య‌క్తికి చెల్లిస్తున్న వేత‌నం.. పూర్తిగా ఆ వ్య‌క్తి స్వార్జిత‌మ‌ని.. అది ఆయ‌న‌కు మాత్ర‌మే తెలియాల‌ని వ్యాఖ్యానించింది. భార్య అయినంత మాత్రాన‌.. భ‌ర్త ఎంత సంపాయిస్తున్నాడో తెలుసుకునే చ‌ట్ట‌ప‌ర‌మైన హ‌క్కు ఏమీ లేద‌ని స్ప‌ష్టం చేసింది. ప్రేమ‌తో అన్నీ తెలుసుకోవ‌చ్చ‌ని తెలిపింది. అదేస‌మ‌యంలో భార్య‌కు ఏలోటూ రానంత వ‌ర‌కు.. భ‌ర్త సంపాద‌న‌ను ప్ర‌శ్నించ‌జాల‌ర‌ని కూడా స్ప‌ష్టం చేసింది.