1993 ముంబై పేలుళ్లను సంజయ్ దత్ ఆపగలిగేవారా?

1993, మార్చి 12…ముంబై బాంబు పేలుళ్ల ఘటన జరిగి దాదాపు 32 ఏళ్లు కావస్తోంది. అయినా సరే, ఆ పేలుళ్ల గురించి వార్తల్లో వింటే చాలు ఆ పేలుళ్ల బాధితులు, పేలుళ్లలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులు ఉలిక్కి పడతారు. ఒక్క రోజులోనే ముంబైలోని 12 ప్రాంతాల్లో పేలుళ్లకు ముష్కరులు పాల్పడ్డారు. ఆ పేలుళ్లలో మొత్తం 257 మంది చనిపోగా..1400 మంది గాయపడ్డారు. అయితే, వేలాదిమందికి పీడకలగా మిగిలిన ఆ భయానక ఉగ్రదాడి జరగకుండా ఆపే చాన్స్ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కు ఉందా? సంజయ్ దత్ సరైన సమయంలో పోలీసులకు సమాచారం ఇచ్చి ఉంటే ఆ ఉగ్రదాడి జరిగేది కాదా? అంటే అవును అనే సమాధానిస్తున్నారు ప్రముఖ న్యాయవాది, బీజేపీ నేత, రాజ్య సభ సభ్యుడు ఉజ్వల్ నికమ్.

ముంబై పేలుళ్ల ఘటన గురించి ఉజ్వల్ నిక్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. సంజయ్ దత్ తలుచుకుని ఉంటే ఆ పేలుళ్లను ఆపి ఉండేవాడని ఆయన చేసిన కామెంట్లు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. ముంబై పేలుళ్లకు కొద్ది రోజుల ముందు సంజయ్ దత్ ఇంటికి ఆయుధాలతో నిండిన ఓ వ్యాన్ ను దావూద్ ఇబ్రహీం అనుచరుడు అబూ సలేం తీసుకువచ్చాడని ఆయన అన్నారు. ఆ వ్యాన్‌లో ఏకే 47 తుపాకులు, బాంబులు ఉన్నాయని, అందులో నుంచి సంజయ్ దత్ ఒక ఏకే 47 తుపాకీని తీసుకున్నారని చెప్పారు.

ఆ ఆయుధాల వ్యాన్ గురించి పోలీసులకు సంజయ్ దత్ సమాచారం ఇచ్చి ఉంటే ఆ పేలుళ్లు జరిగేవి కావని అభిప్రాయపడ్డారు. సంజయ్ దత్ సరిగ్గా స్పందించి ఉంటే ఆ పేలుళ్లలో అంత మంది చనిపోయి ఉండేవారు కాదని అన్నారు. ముంబై పేలుళ్లతో సంబంధం ఉందన్న కారణంతో సంజయ్‌ దత్ పై టాడా యాక్ట్ ప్రకారం కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే, ఆ కేసులో సంజయ్‌ దత్ ను కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. అక్రమంగా ఏకే 47 వంటి ఆయుధాలు కలిగి ఉన్నందుకు సంజయ్‌ దత్ కు కోర్టు ఐదేళ్లు జైలు శిక్ష విధించింది.