ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే… ఏఐ కెమెరాకి చిక్కినట్టే!

వాహనం నడిపేటప్పుడు ఒక క్షణం అజాగ్రత్తగా ఉన్నా భారీ జరిమానా తప్పదు. ఎందుకంటే, ట్రాఫిక్ ఉల్లంఘనలపై కళ్లలా వ్యవహరిస్తున్న కొత్త టెక్నాలజీ రంగంలోకి దిగింది. మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో మొదటిసారిగా ‘ఏఐ ట్రాఫిక్ సిగ్నల్ సిస్టమ్’ అమలులోకి వచ్చింది. దీనివల్ల సిగ్నల్ దాటినా, హెల్మెట్ లేకుండా వెళ్లినా, బెల్ట్ వేసుకోకుండా డ్రైవ్ చేసినా మీ ఫోన్‌కు చలాన్ రసీదు వచ్చేస్తుంది.

ప్రస్తుత పరిస్థితుల్లో రద్దీ ఎక్కువగా ఉన్న కూడళ్లలో ట్రాఫిక్ నియంత్రణ ఒక పెద్ద సవాలుగా మారింది. ఈ సమస్యను అధిగమించడానికి నాగ్‌పుర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థను రూపొందించారు. మొదటి దశగా నగరంలోని 10 జంక్షన్లలో దీనిని అమలు చేయనున్నారు. వీటిలో వాహనాల రద్దీని ఏఐ గుర్తించి, తగిన మార్గాన్ని గ్రీన్ సిగ్నల్ ద్వారా ప్రాధాన్యం ఇస్తుంది.

ఈ వ్యవస్థ కేవలం సిగ్నల్‌లను నియంత్రించడమే కాదు, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించేవారిని గుర్తించి వారి వాహన నంబర్‌ను స్కాన్ చేస్తుంది. తద్వారా, అతివేగం, సీట్ బెల్ట్ లేకపోవడం, హెల్మెట్ లేకపోవడం వంటి విషయాలపై కేసులు నమోదు చేస్తుంది. ఉల్లంఘన చేసిన వాహనదారుల ఫోన్‌కు చలాన్ నోటిఫికేషన్ వెంటనే వస్తుంది.

ఇది ‘ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్’గా పిలవబడుతుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ వ్యవస్థ అమలుతో రోడ్డుపై ప్రయాణ సమయం సగటున 30 శాతం తగ్గుతుందని, వాహనాల వేగం 60 శాతం వరకు మెరుగుపడుతుందని అంచనా. ట్రాఫిక్ నియంత్రణలో ఇది కీలక పరిష్కారంగా మారుతుందని ఆశిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సిస్టమ్ ప్రాథమిక దశలో ఉన్నా, భవిష్యత్తులో మహారాష్ట్ర మొత్తం, ఆపై ఇతర రాష్ట్రాల్లోనూ విస్తరించే అవకాశం ఉంది. వాహనదారులు ఇకపై మరింత జాగ్రత్తగా వాహనం నడపాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ట్రాఫిక్ పోలీస్ కనిపించకపోయినా, AI కెమెరా మాత్రం మీపై కళ్లేసి ఉంచుతుంది. మరి ఈ సిగ్నల్ తెలుగు రాష్ట్రాల్లోకి ఎప్పుడు వస్తుందో చూడాలి.