బెంగళూరులో ఓ మహిళ ఆటో డ్రైవర్ను చెప్పుతో కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆ ఘటన శనివారం జరిగింది. పంఖూరి మిశ్రా అనే మహిళ తన భర్తతో కలిసి బైక్పై ప్రయాణిస్తుండగా, ఆటో డ్రైవర్ తన పాదంపై చక్రం నడిపాడని ఆరోపించారు. అనంతరం ఆమె ఆటో డ్రైవర్ను హిందీలో దూషించి, ఫోన్లో వీడియో తీస్తున్నాడని కోపంతో చెప్పుతో కొట్టారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఆటో డ్రైవర్ లోకేశ్ స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పెద్ద ఎత్తున వైరల్ అయింది. కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు స్పందించి, డ్రైవర్ ఫిర్యాదు మేరకు మిశ్రాను ఆదివారం అరెస్టు చేశారు. అనంతరం ఆమెను స్టేషన్ బెయిల్పై విడుదల చేశారు.
తాజాగా సోమవారం పంఖూరి మిశ్రా తన భర్తతో కలిసి లోకేశ్ను కలసి క్షమాపణ చెప్పింది. “క్షమించండి. నేను ప్రెగ్నెంట్.. గర్భస్రావం అవుతుందేమోననే భయం కారణంగానే అలా ప్రవర్తించాను” అని మిశ్రా అన్నారు. ఆమె, భర్త ఇద్దరూ లోకేశ్ దంపతుల కాళ్ల మీద పడుతూ క్షమాపణ కోరారు. ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆటో డ్రైవర్ లోకేశ్ మాట్లాడుతూ, “తనకు హిందీ భాష అర్థం కాకపోవడం వల్లే వీడియో తీసాను. మిశ్రా భర్త ద్విచక్ర వాహనంపై కూర్చొని ఉండగా ఆమె దాడి చేశారు. నా తప్పు ఏమీ లేదు. సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తే స్పష్టమవుతుంది” అని తెలిపారు. ఈ సంఘటనపై పోలీసులు ఇంకా దర్యాప్తు జరుపుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates