ఇది నార్వే టోర్నీలో చోటుచేసుకున్న అద్భుతమైన క్షణం. ప్రపంచ నంబర్వన్ మాగ్నస్ కార్ల్సన్ను ఓడించడం అంటే సాధారణ విషయం కాదు. కానీ భారత యువ గ్రాండ్మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ ఇది సాధించేశాడు. చెస్ ప్రపంచంలో దీన్ని ‘టర్నింగ్ పాయింట్’గా అభివర్ణించొచ్చు. ఈ విజయంతో గుకేశ్ ప్రత్యక్షంగా ప్రపంచ స్థాయిలో తనను తాను నిలబెట్టుకున్నాడు.
ఆరు రౌండ్లలో కీలకంగా నిలిచిన ఈ పోరులో గుకేశ్ ఆటలో ఓ వృద్ధి స్పష్టంగా కనిపించింది. కార్ల్సన్ చేసిన చిన్న పొరపాటును వెంటనే గుర్తించి తన ప్రయోజనంగా మలచుకున్నాడు. ఈ ఒత్తిడిలో మాగ్నస్ పిడికిలితో టేబుల్ కొట్టడం చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత గుకేశ్ను క్షమించమని రెండు సార్లు అడగడం కూడా కార్ల్సన్పై ఒత్తిడి ఎలా పెరిగిందో చెప్పకనే చెబుతోంది.
నెంబర్ వన్ ప్లేయర్ ను మూడో స్థానంలో ఉన్న గుకేశ్ ఓడించడంతో వరల్డ్ వైడ్ గా ఈ పోరు హైలెట్ అయ్యింది. ఇప్పటివరకు టోర్నీలో గుకేశ్ స్థిరంగా ఆడుతున్నా, ఈ మ్యాచ్ తర్వాత అతనిపై అంతర్జాతీయంగా దృష్టి మరలింది. గతేడాది ఇదే టోర్నీలో ప్రజ్ఞానంద కూడా కార్ల్సన్ను ఓడించిన విషయం తెలిసిందే. అంటే భారత యువత చెస్లో ప్రపంచ నంబర్వన్ను ఎదుర్కొనే స్థాయికి చేరిపోయిందని ఇది సూచన.
ప్రస్తుతం కార్ల్సన్ టాప్లో ఉన్నప్పటికీ ఈ ఓటమి అతనికి మానసికంగా పెద్ద ఎదురుదెబ్బే. ఇక గుకేశ్ అద్భుత ఫామ్లో ఉండటంతో ముందు వచ్చే మ్యాచ్లపై ఆసక్తి మరింత పెరిగింది. ఒకప్పుడు చెస్ను చూసేది కొద్దిమంది మాత్రమే అయితే, ఇప్పుడు గుకేశ్, ప్రజ్ఞానంద లాంటి యువ క్రీడాకారుల విజయాలతో ఈ ఆట సామాన్య ప్రేక్షకుల్లోకి చొచ్చుకుపోతోంది అనడంలో సందేహం లేదు.