=

‘సిందూర్’పై ద్వివేదీ ఫ్యామిలీ భావోద్వేగం!

పహల్ గాంలో జరిగిన ఉగ్రవాద దాడిలో భారత్ కు చెందిన 26 మంది సాధారణ పౌరులు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. కశ్మీర్ అందాలను చూసేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కశ్మీర్ వెళ్లిన భారతీయులపై పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. మతం అడిగి మరీ కాల్చి చంపారు. ఈ దాడులను తీవ్రంగా పరిగణించిన భారత ప్రభుత్వం…దాడులకు బాధ్యులుగా గుర్తిస్తూ… పాక్ భూభాగంలో కొనసాగుతున్న 9 ఉగ్రవాద శిబిరాలపై మంగళవారం తెల్లవారుజామున వైమానికి దాడులతో విరుచుకుపడింది. మిలిటరీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడులు తమ నిర్దేశిత లక్ష్యాలను తుత్తునీయలు చేశాయి.

ఈ దాడులపై దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తం అవుతోంది. అదే సమయంలో పహల్ గాం ఉగ్రవాద దాడుల్లో మరణించిన వారి కుటుంబాలు అయితే ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ భావోద్వేగ ప్రకటనలు చేస్తున్నారు. అందులో భాగంగానే పహల్ గాం ఉగ్ర దాడిలో ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోకు చెందిన శుభం ద్వివేదీ కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో ఆపరేషన్ సిందూర్ గురించి తెలిసిన వెంటనే ద్వివేదీ సతీమణి ఐశన్య ద్వివేదీ భావోద్వేగ ప్రకటన చేశారు. ఐశన్యతో పాటు శుభం ద్వివేదీ తండ్రి సంజయ్ ద్వివేదీ కూడా భారత దాడులపై తనదైన శైలిలో స్పదించారు.

ఆపరేషన్ సిందూర్.. పాక్ లోని ఉగ్రవాద శిబిరాలపై జరిగిన దాడి ఓ సాధారణ ప్రతీకారం కాదని ఐశన్య ద్వివేదీ తెలిపారు. ఈ దాడులు తన భర్తకు అర్పించిన నివాళిగా అమె పేర్కొన్నారు. ప్రధాని మోదీ తమ నమ్మకాన్ని నిలబెట్టుకున్నారని కీర్తించారు. ఆపరేషన్ సిందూర్ తన భర్త త్యాగానికి నిజమైన గౌరవంగా అభివర్ణించిన ఐశన్య… తన భర్త ఆత్మ ఇప్పుడు శాంతిస్తుందనే నమ్మకముందని పేర్కొన్నారు. తన భర్త మరణానికి భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుందన్న ఐశన్య… అందుకు అనుమతించిన మోదీకి ఆమె ప్రత్యకంగా ధన్యవాదాలు తెలియజేశారు.

ఇక శుభం తండ్రి సంజయ్ మాట్లాడుతూ భారత సైన్య చేపట్టిన ఈ చర్య దేశ ప్రభుత్వంపై నమ్మకాన్ని పెంచిందన్నారు. ఆపరేషన్ సిందూర్ జరిపిన భారత సైన్యానికి సెల్యూట్ చెప్పిన సంజయ్… ప్రధాని మోదీని ధన్యవాదాలు తెలియ జేశారు. పాక్ లో విజృంభిస్తున్న ఉగ్రవాదాన్ని భారత సైన్యం ఎలా నాశనం చేసిందో… దానికి తామంతా సైన్యానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు వెల్లడించారు. ఆపరేషన్ సిందూర్ వార్త విన్నప్పటి నుంచి తమ కుటుంబం ప్రశాంతంగా ఉందని కూడా సంజయ్ పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్ తో పెహల్ గాం బాధిత కుటుంబాలకు ఎట్టకేలకు న్యాయం జరిగినట్టైందని శుభం ద్వివేదీ బంధువు మనోజ్ వ్యాఖ్యానించారు.