ఐపీఎల్: 74 నుంచి 94 మ్యాచులకు స్కెచ్!

భవిష్యత్తులో ఐపీఎల్ మరింత పెద్దది కానుందా? ఇప్పుడీ చర్చ జోరుగా సాగుతోంది. తాజాగా ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ ఇచ్చిన హింట్ ప్రకారం, 2028 నుంచి టోర్నమెంట్‌లో మ్యాచ్‌ల సంఖ్యను పెంచే యోచనలో బీసీసీఐ ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం 74 మ్యాచ్‌లు జరుగుతున్న ఐపీఎల్‌ను 94 మ్యాచ్‌ల వరకూ విస్తరించే ప్రతిపాదనపై చర్చలు జరుగుతున్నాయన్నారాయన.

ఇప్పటి ఫార్మాట్ ప్రకారం 10 జట్లు ఉన్నాయి. గ్రూప్ పద్ధతిలో లీగ్ స్టేజ్ నిర్వహించబడుతోంది. కానీ మ్యాచ్‌ల సంఖ్య పెంచాలంటే ప్రతి జట్టు మిగతా అన్ని జట్లతో రెండేసి సార్లు తలపడే విధానం అమలు చేయాలని బీసీసీఐ భావిస్తోంది. అప్పుడు మొత్తం 90 లీగ్ మ్యాచ్‌లు, 4 ప్లేఆఫ్ మ్యాచ్‌లు కలిపి 94 మ్యాచులు పూర్తవుతాయి. దీనివల్ల టోర్నమెంట్ ఇంకా బలంగా మారే అవకాశం ఉంది.

అయితే దీనికి ముందు ఐపీఎల్ మీడియా హక్కుల కొత్త ఒప్పందం రానుంది. ప్రస్తుతం ఉన్న బ్రాడ్‌కాస్ట్ డీల్స్ 2027 సీజన్‌తో ముగుస్తాయి. అందువల్ల 2028 నుంచి వచ్చే కొత్త హక్కుల కాలానికి ముందు ఈ మార్పులపై నిర్ణయం తీసుకునే యోచనలో ఉన్నారు. అభిమానుల ఆసక్తిని, ఐసీసీ షెడ్యూల్‌ను దృష్టిలో పెట్టుకొని పూర్తిస్థాయిలో పరిశీలన జరుగుతోందని అరుణ్ ధుమాల్ తెలిపారు.

94 మ్యాచ్‌ల విధానం అమలవుతే, అభిమానులకు మరింత క్రికెట్ వినోదం లభించనుంది. పైగా, ప్రతి జట్టుకు హోమ్-అవే మ్యాచులు సమంగా రావడం లీగ్ న్యాయబద్ధతను పెంచుతుంది. ఇది జట్ల మధ్య సఖ్యతను, పోటీని మరింత పెంచే అవకాశం కల్పిస్తుంది. మొత్తం మీద 2028 నుంచి ఐపీఎల్ మలుపు తిప్పే అవకాశం కనిపిస్తోంది. మ్యాచ్‌ల సంఖ్య పెంపుతో పాటు, కొత్త ఆటగాళ్లకు అవకాశాలు, ఆదాయ వృద్ధి వంటి ప్రయోజనాలూ ఉండే అవకాశం ఉంది. మరి అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో వేచి చూడాలి.