ప్రపంచంలో మరే దేశంలో ఉండని భిన్నత్వంలో ఏకత్వం భారత్ లోనే ఉంటుంది. నిజమే.. కొన్ని అభిప్రాయ బేధాలు ఉండొచ్చు. అయినప్పటికీ మతసామరస్యంలో మాత్రం మనకు మించినోళ్లు లేరన్న భావన కలుగక మానదు. హిందూ.. ముస్లిం అంటూ బేధాభిప్రాయాలని క్రియేట్ చేసే వారికి భిన్నంగామతాలకు అతీతంగా ప్రేమాభిమానాలే ప్రాణవాయువులుగా తపించే వారు ఉంటారు. తాజాగా అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ లో చోటు చేసుకున్న ఒక ఉదంతం గురించి తెలిస్తే వావ్ అనకుండా ఉండలేరు.
ఉట్నూర్ మండలంలోని శ్యాంపూర్ గ్రామానికి చెందిన షేక్ సలీం ఉపాధి కోసం ముప్ఫై ఏళ్ల క్రితం హైదాబాద్ కు వెళ్లిపోయారు. ఆ మహానగరంలోని ఒక ఆసుపత్రితో ల్యాబ్ టెక్నీషియన్ గా పని చేస్తున్నాడు. కానీ.. తన ఊళ్లో మాత్రం తరచూ ఏదో ఒక సామాజిక సేవా కార్యక్రమాల్ని చేపడుతుండేవారు. అంతేనా.. ఊళ్లో ఎవరైనా అనారోగ్యానికి గురైతే.. వారిని హైదరాబాద్ కు తీసుకొచ్చి.. అన్నీ తానై చూసుకొని.. వారిని ఆరోగ్య వంతులుగా చేసి ఊరికి పంపేవాడు.
ఇటీవల సలీంకు బ్రెయిన్ ట్యూమర్ బారిన పడ్డాడు. ప్రస్తుతం అతను ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. దీంతో.. అతడి కోసం ఊళ్లోని హిందువులంతా అతనికి స్వస్థత చేకూరాలని.. ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడాలన్న ఉద్దేశంతో స్థానిక ఆంజనేయస్వామి దేవాలయంలో యజ్ఞం చేపట్టారు. తమ సలీంను కాపాడాలి భగవంతుడా అని వేడుకుంటున్నారు. ఇదంతా చదివిన తర్వాత అర్థమవుతుందా.. మన దేశం ప్రత్యేకత ఏమిటో?