ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్ లో పాకిస్థాన్ పై భారత్ ఘన విజయం సాధించింది. 6 వికెట్ల తేడాతో చిరకాల ప్రత్యర్థి పాక్ ను చిత్తు చేసింది. రన్ మెషీన్ విరాట్ కోహ్లీ అద్భుత సెంచరీతో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ మ్యాచ్ లో ఓటమితో ఆతిథ్య జట్టు పాక్ ఇంటిదారి పట్టింది. తన కెరీర్ లో 51వ సెంచరీ సాధించిన కోహ్లీ మరో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు.
వన్డే క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 14వేల పరుగులు సాధించిన క్రికెటర్ గా కోహ్లీ రికార్డు క్రియేట్ చేశాడు. 287 ఇన్నింగ్స్లు ఆడి కోహ్లీ ఈ ఘనత సాధించగా… సచిన్ టెండూల్కర్ 350 ఇన్నింగ్స్లు, కుమార సంగక్కర 378 ఇన్నింగ్స్లు ఆడి ఈ ఘనత సాధించారు.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన పాక్ 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ రిజ్వాన్ (77 బంతుల్లో 46), షకీల్ (76 బంతుల్లో 62) మినహా మిగతా బ్యాటర్లు రాణించలేదు. భారత బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్, ఫీల్డింగ్ తో పాక్ బ్యాటర్లను కట్టడి చేశారు. భారత బౌలర్లలో కుల్దీప్ 3, హార్దిక్ పాండ్యా 2, హర్షిత్ రాణా, జడేజా, అక్షర్ పటేల్ లు ఒక్కో వికెట్ పడగొట్టారు.
242 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు రోహిత్ శర్మ, గిల్ మంచి ఓపెనింగ్ ఇచ్చారు. అయితే, రోహిత్ 20 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత గిల్, కోహ్లీలు ఇన్నింగ్స్ చక్కదిద్దారు. గిల్ (46) ఔటైన తర్వాత కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ లు నిలకడగా ఆడారు. కోహ్లీ, అయ్యర్ పాక్ బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా చక్కటి భాగస్వామ్యం నెలకొల్పారు.
56 పరుగులు చేసి చివర్లో అయ్యర్ అవుట్ అయ్యాడు. భారత్ విజయానికి 2 పరుగులు కావాల్సిన దశలో కోహ్లీ 96 పరుగులతో స్ట్రైక్ లో ఉన్నాడు. చక్కటి బౌండరీతో సెంచరీ చేసి భారత్ కు కోహ్లీ చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. చాలాకాలం తర్వాత కింగ్ కోహ్లీ ఈజ్ బ్యాక్ అనిపించేలా కోహ్లీ అద్భుతమైన షాట్లతో సెంచరీ బాదాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates