విషాదం: 20 నిమిషాల్లో 18 మంది ప్రాణాలు పోయాయి

దేశ రాజధానిలోని న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లో శనివారం రాత్రి జరగిన తొక్కిసలాటలో 18 మంది మృతి చెందగా.. మరో 30 మంది దాకా గాయపడ్డారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింతగా పెరిగే ప్రమాదం లేకపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఓ వదంతి, మరో చిన్న ప్రకటన…ఈ తొక్కిసలాటకు దారి తీసినట్లుగా తెలుస్తోంది.

ప్రయాగ్ రాజ్ కు వెళ్లే రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయన్న వదంతి, ఆ తర్వాత మరో ప్రత్యేక రైలును ప్రయాగ్ రాజ్ కు నడుపుతున్నట్లుగా రైల్వే శాఖ ప్రకటన ప్రయాణికుల మధ్య తోపులాటకు దారి తీసిందట. ఈ తోపులాటపై రైల్వే శాఖ సమగ్ర దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసింది.

ఇక ఈ ప్రమాదం జరిగిన తీరు విస్తుగొలుపుతోంది. రాత్రి 9.30 – 10 గంటల మధ్యలో జరిగిన ఈ ఘటనలో కేవలం 20 నిమిషాల పాటు తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ 20 నిమిషాల వ్యవధిలో అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. ఆ సమయంలోనే జరగాల్సిన నష్టమంతా జరిగిపోయింది.

ఒక్కసారిగా జరిగిన తోపులాటలో ఎక్కడివారు అక్కడ పడిపోయారు. పడిపోయిన వారిపై జనం తొక్కుకుంటూ వెళ్లారు. పలితంగా శ్వాస పీల్చుకోవడం కష్టంగా మారిన చాలా మంది ప్రయాణికులు ఆసుపత్రికి తరలించేలోగానే ప్రాణాలు కోల్పోయారు. ఆ 20 నిమిషాల తొక్కిసలాటలో ఏకంగా 18 మంది ప్రాణాలు కోల్పోవడం, 30 మంది దాకా గాయపడటం కళ్లు మూసి తెరిచేలోగానే జరిగిపోయింది.

మహా కుంభమేళ ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో ప్రయాగ్ రాజ్ లో పుణ్య స్నానాల కోసం జన ఎగబడుతున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో శనివారం రాత్రి పెద్ద ఎత్తున జనం ప్రయాగ్ రాజ్ కు వెళ్లేందుకు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. చూస్తుండగానే,… స్టేషన్ లోని 14,15 ఫ్టాల్ ఫారాలు జనంతో నిండిపోయాయి.

ఈ సమయంలోనే ప్రయాగ్ రాజ్ కు దారితీసే స్వతంత్ర సేనాని ఎక్స్ ప్రెస్, భువనేశ్వర్ రాజధాని ఎక్స్ ప్రెస్ రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయంటూ వదంతులు వినిపించాయి. ఆ వెంటనే ప్రయాగ్ రాజ్ కు ఓ ప్రత్యేక రైలును ఏర్పాటు చేసినట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఫలితంగా ఒక్కసారిగా ప్రయాణికుల మధ్య తొక్కిసలాట జరిగింది.

ప్రభావితుల కోసం ప్రభుత్వం ఈ విధంగా పరిహారం ప్రకటించింది.

> మృతుల కుటుంబాలకు ₹10 లక్షలు

> గాయాలు తీవ్రంగా ఉన్నవారికి ₹2.5 లక్షలు

> స్వల్ప గాయాలు పొందినవారికి ₹1 లక్ష