గోల్డ్ మెడల్ సాధించినా దక్కని కొలువు… బీటెక్ స్టూడెంట్ సూసైడ్

ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌లో ఒక తీవ్ర విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. 23 ఏళ్ల వయసున్న ఒక బీటెక్ గోల్డ్ మెడలిస్ట్ యువకుడు తన ఇంట్లో బలవన్మరణానికి పాల్పడ్డాడు. అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగం సాధించలేకపోయానంటూ తన తండ్రికి క్షమాపణలు చెబుతూ అతను రాసిన సూసైడ్ నోట్ అక్కడ లభ్యమైంది. విద్యాభ్యాసంలో ఎంతో ప్రతిభ కనబరిచిన యువకుడు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం స్థానికంగా కలచివేసింది.

మృతుడిని ఆనంద్ కుమార్‌గా గుర్తించారు. అతను కాన్పూర్‌లోని ప్రాణ్‌వీర్ సింగ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (PSIT) లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగంలో టాపర్‌గా నిలిచాడు. 2024 లో బీటెక్ పూర్తి చేసిన ఆనంద్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే మూడో ర్యాంకు సాధించాడు. ఆ ప్రతిభకు గుర్తింపుగా కాలేజ్ ఫంక్షన్‌లో ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందిబెన్ పటేల్ చేతుల మీదుగా గోల్డ్ మెడల్ కూడా అందుకున్నాడు.

ఆనంద్ కుటుంబ సభ్యులు పెద్ద కుమారుడి పెళ్లి సంబంధం ఖాయం చేయడానికి బీహార్‌లోని తమ సొంత ఊరికి వెళ్లిన సమయంలో గోవింద్ నగర్‌లోని తన నివాసంలో ఈ ఘటన జరిగింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆనంద్ గదిలో ఉరివేసుకుని కనిపించాడు. పనిమనిషి వచ్చి ఎంత పిలిచినా తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చి పొరుగువారికి, పోలీసులకు సమాచారం అందించగా ఈ విషయం బయటపడింది.

పోలీసులు ఘటనా స్థలం నుండి ఇంగ్లీషులో రాసిన 5 లైన్ల నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. “సారీ పాపా, ప్రభుత్వ ఉద్యోగం కోసం దాదాపు 50 సార్లు ప్రయత్నించాను, కానీ సక్సెస్ కాలేకపోయాను, నన్ను క్షమించండి” అని అందులో రాసి ఉంది. చదువు పూర్తయిన తర్వాత అతను పవర్ గ్రిడ్‌లో ఏడాది పాటు అప్రెంటిస్‌షిప్ కూడా చేశాడని అతని తండ్రి రాజ్‌కుమార్ తెలిపారు.

ఆ తర్వాత రైల్వేస్, ఎస్‌ఎస్‌సి, బ్యాంకులు, విద్యాశాఖ నిర్వహించిన పలు పోటీ పరీక్షలకు ఆనంద్ హాజరయ్యాడని, కానీ ఫలితం దక్కకపోవడంతో గత కొన్ని నెలలుగా తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురయ్యాడని తండ్రి కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు కేసుగా నమోదు చేసుకుని, పూర్తి వివరాలను సేకరించే పనిలో పడ్డారు.