బీసీల‌కు పండ‌గ చేస్తున్నారా… బాబు ఆలోచ‌నేంటి…?

టీడీపీకి రాజ‌కీయంగా ఆది నుంచి అండ‌గా ఉన్న బీసీల‌కు మ‌రింత మేలు చేయాల‌ని సీఎం చంద్ర‌బాబు సంక‌ల్పించారు. ఎన్నిక‌ల‌కుముందు ఇచ్చిన హామీల మేర‌కు బీసీల జీవితాల్లో వెలుగులు నింపేలా ఆయ‌న నిర్ణ‌యించారు. ప్ర‌తి బీసీ కుటుంబానికీ మేలు చేయాల‌న్న‌ది చంద్ర‌బాబు సంక‌ల్పంగా ఉంది. ఈ క్ర‌మంలో దేశ‌వ్యాప్తంగా ఓబీసీల గ‌ణ‌న జ‌రుగుతున్నట్టుగానే.. ఇక్క‌డ బీసీల‌కు సంబంధించి లెక్క‌లు తెలుసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

క్షేత్ర‌స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు ఎంత మంది ఉన్నారు? వారి ఆర్థిక ప‌రిస్థితి ఏంటి? ఉద్యోగాలు, ఉపాధి వంటివాటిని తెలుసుకునేందుకు స‌ర్కారు రెడీ అయింది. ఢిల్లీకి లేదా చెన్నైకి చెందిన ప్ర‌తిష్టాత్మ‌క సంస్థ‌ల‌తో(ఇంకా ఫైనల్ కాలేదు) స‌ర్వే చేయించాల‌ని స‌ర్కారు నిర్ణ‌యించుకుంది. ఇది న‌వంబ‌రు తొలి వారం నాటికి పూర్తి అవుతుంద‌ని స‌మాచారం. క్షేత్ర‌స్థాయిలో బీసీల ప‌రిస్థితిని ఈ సంస్థ నిశితంగా అంచ‌నా వేయ‌నుంది.

త‌ద్వారా.. బీసీలు ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు? వారికి ఎలాంటి మెరుగైన సౌక‌ర్యాలు క‌ల్పిం చాల‌నే విష‌యంపై చంద్ర‌బాబు దృష్టి పెట్టనున్నారు. ప్ర‌స్తుతం పొందుతున్న ఉపాధిని మ‌రింత నాణ్య మైన శిక్ష‌ణ ఇచ్చి.. అప్ గ్రేడ్ చేయాల‌న్న‌ది ఒక నిర్ణ‌యంగా ఉంది. ఇదేస‌మ‌యంలో ఉపాధి క‌ల్ప‌న‌తో పాటు యువ‌త‌కు ఉద్యోగాల క‌ల్ప‌న దిశ‌గా కూడా చంద్ర‌బాబు నిర్ణ‌యించారు. గ‌తంలో బీసీల కోసం.. ప‌నిముట్లు ఇచ్చే ప‌థ‌కానికి శ్రీకారం చుట్టిన విష‌యం తెలిసిందే.

వారి వారి వృత్తుల‌ను బ‌ట్టి.. ప‌నిముట్ల‌ను ఉచితంగా అందించారు. అయితే.. ఇప్పుడు టెక్నాల‌జీ మ‌రింత వేగంగా విస్త‌రించిన నేప‌థ్యంలో వృత్తి ప‌నులు చేసుకునేవారికి నైపుణ్య శిక్ష ఇచ్చి.. సాంకేతిక‌త‌ను చేరువ చేయాల‌ని నిర్ణ‌యించారు. ఫ‌లితంగా బీసీల ఆదాయం రెట్టింపు కావ‌డంతోపాటు.. వారి జీవ‌న స్థితిగ‌తులు కూడా మార్చాల‌ని చంద్ర‌బాబు నిర్ణ‌యించారు. ఈ ప‌రిణామాన్ని రాజ‌కీయ కోణంలో కాకుండా సామాజిక కోణంలో చేస్తుండ‌డం ఆహ్వానించ‌ద‌గిన ప‌రిణామం.