ఉదయనిధికి ప్రశంసలు.. పవన్‌పై కౌంటర్లు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు, సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్‌కు మధ్య కొన్ని రోజులుగా ఆన్ లైన్లోనే కాక బయటా వాదనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. తిరుమల లడ్డు వివాదం నేపథ్యంలో పవన్ కళ్యాణ్.. సనాతన ధర్మం గురించి బలంగా గళం వినిపిస్తుండగా.. ఆయన తీరును ప్రకాష్ రాజ్ తప్పుబడుతున్నారు. సున్నితమైన అంశాన్ని జాతీయ స్థాయిలో బ్లో అప్ చేసి రాజకీయ ప్రయోజనానికి వాడుకుంటున్నారని, ప్రజలను విభజిస్తున్నారని పవన్ మీద ఆయన పరోక్ష విమర్శలు చేస్తున్నారు. పవన్ కూడా ఆయనకు దీటుగానరే బదులిస్తున్నారు.

తాజాగా ‘ఎక్స్’లో ప్రకాష్ రాజ్ స్పందిస్తూ.. “మీరు సనాతన ధర్మ రక్షణలో ఉండండి. మేం సమాజ రక్షణలో ఉంటాం” అంటూ పెట్టిన పోస్టు దుమారం రేపింది. పవన్ అభిమానులు ఆయన మీద మండిపడుతున్నారు. సమాజం కోసం పవన్ ఏం చేశాడో.. ప్రకాష్ రాజ్ ఏం చేశాడో పోల్చి ఆయన్ని దుయ్యబడుతున్నారు.

కానీ ప్రకాష్ రాజ్ మాత్రం ఆగట్లేదు. తాజాగా పవన్ మీద ఆయన మాటల దాడిని మరింత పెంచారు. ఒక రాజకీయ సభలో పవన్‌ను కొంచెం ఘాటుగానే విమర్శించారు ప్రకాష్ రాజ్. ఇటీవలే తమిళనాడు డిప్యూటీ సీఎంగా నియమితుడైన ఉదయనిధి స్టాలిన్ మీద ప్రశంసలు కురిపిస్తూ.. పవన్‌ను తగ్గించే ప్రయత్నం చేశారు ప్రకాష్ రాజ్. ఉదయనిధి కూడా ఈ సభలో పాల్గొనగా.. డిప్యూటీ సీఎం అయినందుకు తనకు అభినందనలు చెబుతూ.. ఈ డిప్యూటీ సీఎం సమానత్వం గురించి మాట్లాడుతుంటే, ఇంకో డిప్యూటీ సీఎం ఏమో సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నాడని.. ఆయన అలాగే ఉండనీ, మేం ఇలాగే ఉంటాం అంటూ వ్యాఖ్యానించారు ప్రకాష్ రాజ్.

ఇంకో డిప్యూటీ సీఎం అనడం చాలా వెటకారం కనిపించింది ప్రకాష్ రాజ్ మాటల్లో. మరోవైపు తాను ధైర్యంగా నిజాలు మాట్లాడుతుంటానని ఒక వ్యక్తి అన్నారని.. కానీ నిజాలు మాట్లాడ్డానికి ధైర్యమెందుకని, అబద్ధాలు చెప్పడానికే అది ఉండాలని ప్రకాష్ రాజ్ వ్యాఖ్యానించారు.