పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’కు తెలంగాణలో టికెట్ల ధరలు ఎలా ఉంటాయన్నది గత కొన్ని రోజులుగా సస్పెన్సుగా మారింది. పుష్ప-2 రిలీజ్ టైంలో చోటుచేసుకున్న విషాదం తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఇకపై పెద్ద సినిమాలకు కూడా టికెట్ల ధరలు పెంచకూడదని గట్టి నిర్ణయం తీసుకుని, దానికే కట్టుబడి ఉన్న సమయంలోనూ ‘హరిహర వీరమల్లు’కు అవకాశమిచ్చారు.
తర్వాత తిరిగి రేట్ల పెంపు అమల్లోకి వచ్చింది. కానీ ఆ సినిమాతో పాటు పలు చిత్రాలకు రేట్లు పెంచినపుడు కోర్టుల్లో కేసులు పడడం, ఇబ్బందులు తలెత్తడం తెలిసిందే. ఐతే సంక్రాంతి సినిమా ‘మన శంకర వరప్రసాద్ గారు’కు రేట్లు పెంచడంపై సీరియస్ అయిన కోర్టు.. ఇకపై ఏ కొత్త సినిమాకు అదనపు రేట్లు ఇవ్వాలన్నా 90 రోజుల ముందే దరఖాస్తు చేయాలని, ప్రభుత్వమూ ఓకే చేయాలని స్పష్టం చేసింది. ఐతే అంత ముందుగా రిలీజ్ డేట్ ఖాయం చేసుకుని జీవో తెచ్చుకోవడం అంటే దాదాపు అసాధ్యం కావడంతో ఇక తెలంగాణలో అదనపు రేట్లు, బెనిఫిట్ షోలకు తెర పడ్డట్లే అని అంతా అనుకున్నారు.
ఐతే మన శంకర వరప్రసాద్ గారు రిలీజ్ టైంలో సినిమా టికెట్ల ధరల పెంపుపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను తాజాగా సుప్రీంకోర్టు నిలిపి వేసింది. టికెట్ రేట్లు పెంచాలంటే సినిమా విడుదలకు 90 రోజుల ముందే ప్రభుత్వం జీవో జారీ చేయాలన్న హైకోర్టు ఆదేశాలను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది.
హైకోర్టు ఆదేశాలపై మైత్రీ మూవీ మేకర్స్ సుప్రీంకోర్టులో పిటిషన్ వెయ్యగా.. జస్టిస్ మహేశ్వరి, జస్టిస్ ఏఎస్ చంద్రశేఖర్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించి, టికెట్ ధరల పెంపుపై ఎప్పుడూ అనుసరిస్తున్న విధానాన్నే పాటించాలని స్పష్టం చేసింది. దీంతో మైత్రి సంస్థ నిర్మించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రానికి లైన్ క్లియర్ అయినట్లే.
గత ఏడాది కొత్త సినిమాలకు రేట్లు, బెనిఫిట్ షోలు ఆగిపోయిన టైంలో పవన్ సినిమా హరిహర వీరమల్లు చిత్రానికి ఆ సౌలభ్యం దక్కింది. తర్వాత ప్రతి పెద్ద సినిమాకు జీవో ఇస్తూ పోయారు. హైకోర్టు ఆదేశాలతో మధ్యలో బ్రేక్ పడగా.. మళ్ళీ పవన్ చిత్రంతోనే ఇండస్ట్రీకి ఊరట లభిస్తోంది. ప్రేక్షకుల ఫీలింగ్ ఏమో కానీ ఇండస్ట్రీకి మాత్రం ఒకరకంగా ఈ విషయంలో పవన్ ఆశాజ్యోతిగా మారాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
