నందిగం సురేష్‌కు బెయిల్‌.. ఎన్ని ష‌ర‌తులంటే!

వైసీపీ కీల‌క నాయ‌కుడు, బాప‌ట్ల‌ మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్ర‌స్తుతం గుంటూరు జైల్లో ఉన్న ఆయ‌న‌కు హైకోర్టు కొంత మేర‌కు రిలీఫ్ ఇచ్చింది. అయితే.. అనేక ష‌రతులు విధించింది. మంగ‌ళ‌గిరిలోని టీడీపీ కేంద్ర కార్యాల‌యంపై 2021లో వైసీపీ కార్య‌క‌ర్త‌లు దాడి చేసిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో కార్యాల‌యం ధ్వంస‌మైంది. దీనిపై అప్ప‌ట్లోనే కేసులు న‌మోదు చేసినా కీల‌క వ్య‌క్తుల‌ను మాత్రం పక్క‌న పెట్టారు. ఈ క్ర‌మంలో తాజాగా కూట‌మి స‌ర్కారు దీనిని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని మ‌రిన్ని కేసులు న‌మోదు చేసింది.

ఈ నేప‌థ్యంలోనే మాజీ ఎంపీ నందిగం సురేష్ స‌హా 30 మందిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు త‌ర‌లించారు. వీరిని మాజీ సీఎం వైసీపీ అధినేత జ‌గ‌న్ కూడా ప‌రామ‌ర్శించిన విష‌యం తెలిసిందే. ఇక‌, ఇదే కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి జోగి ర‌మేష్‌, వైసీపీ యువ నేత దేవినేని అవినాష్ చౌద‌రి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి స‌హా మ‌రికొంద‌రు సుప్రీంకోర్టును ఆశ్ర‌యించి ముంద‌స్తు బెయిల్ తెచ్చుకున్నారు. ప్ర‌స్తుతం వీరిపై ద‌ర్యాప్తు కొన‌సాగుతోంది. అయితే.. జైల్లో ఉన్న నందిగం సురేష్ స‌హా.. విజ‌య‌వాడ డిప్యూటీ మేయ‌ర్ అవుతు శైల‌జ భ‌ర్త అవుతు శ్రీనివాస‌రెడ్డిల‌ను పోలీసులు అరెస్టు చేసి జైల్లో ఉంచారు.

కొన్నాళ్ల కింద‌టే వీరు త‌మ‌కు బెయిల్ మంజూరు చేయాల‌ని ఏపీ హైకోర్టును అభ్య‌ర్థించారు. ఈ క్ర‌మంలో ప‌లు మార్లు వాద ప్ర‌తివాద‌న‌లు విన్న హైకోర్టు తాజాగా వీరికి బెయిల్ మంజూరు చేసింది. అయితే.. ప‌లు ష‌ర‌తులు విధించింది. రూ.15 పూచీక‌త్తులు రెండు స‌మ‌ర్పించాల‌ని సూచించింది. అదేవిధంగా ఈ కేసులో చార్జిషీట్ దాఖ‌ల‌య్యే వ‌ర‌కు 1, 15 తారీకుల్లో సంబంధిత పోలీసు స్టేష‌న్‌కు వెళ్లి సంత‌కం చేయాల‌ని నిర్దేశించింది. అంతేకాదు.. విచార‌ణాధికారి ఎప్పుడు పిలిస్తే అప్ప‌డు ద‌ర్యాప్తునకు స‌హ‌క‌రించాల‌ని కూడా ష‌ర‌తు విధించింది. పాస్ పోర్టును పోలీసుల‌కు అందించాల‌ని.. విదేశాల‌కు వెళ్ల‌రాద‌ని పేర్కొంది.

అదేవిధంగా సాక్షుల‌ను ప్ర‌భావితం చేయ‌రాద‌ని మాజీ ఎంపీ నందిగం సురేష్‌, అవుతు శ్రీనివాస‌రెడ్డికి కోర్టు తేల్చి చెప్పింది. అంతేకాదు.. ఇక‌పై ఇలాంటి నేరాల్లో పాలు పంచుకోరాద‌ని, క‌నీసం వాటి ఊసు కూడా ఎత్తరాద‌ని పేర్కొంది.తాజా కేసుకు సంబంధించిన వివ‌రాల‌ను ఎక్క‌డా వెల్ల‌డించరాద‌ని కూడా ష‌రతుల్లో పేర్కొంది. ఈ మేర‌కు న్యాయ‌మూర్తి జ‌స్టిస్ కృపాసాగ‌ర్ త‌న తీర్పులో పేర్కొన్నారు. కాగా, శ‌నివారం మ‌ధ్యాహ్నం నాటికి నందిగం సురేష్ జైలు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంది.