ఈ మౌనం… దేనికి సిగ్న‌ల్‌ రేవంత‌న్నా?!

ఒక వివాదం చెల‌రేగిన‌ప్పుడు వెంట‌నే స్పందించ‌డం అనేది ఇటీవ‌ల కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో నూ క‌నిపిస్తోంది. ముఖ్య‌మంత్రులే ఆయా విష‌యాల‌పై స్పందిస్తున్నారు. ప్ర‌తిప‌క్షాలు చేస్తున్న‌, చేసే విమ‌ర్శ‌ల‌కు వెంట‌నేరియాక్ట్ కూడా అవుతున్నారు. మ‌రీ ముఖ్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అయితే.. మ‌రింత దూకుడుగా కౌంట‌ర్ ఇస్తున్నారు. కానీ, మంత్రి కొండా సురేఖ‌కు సంబంధించిన తాజా వివాదంపై మాత్రం రేవంత్ రెడ్డి ఎడ‌తెగ‌ని మౌనం పాటిస్తున్నారు.

నిజానికి సురేఖ వ్య‌వ‌హారం.. ఖండాంత‌రాలు దాటిపోయిన చందంగా కేవ‌లం రాజ‌కీయ నేత‌లే కాకుండా సామాజిక వేత్త‌లు.. ఎన్న‌డూ మీడియా ముందుకు రాని మ‌హేష్‌బాబు, జూనియ‌ర్ ఎన్టీఆర్ వ‌ర‌కు కూడా స్పందించేలా చేసింది. అన్ని వైపుల నుంచి విమ‌ర్శ‌ల శ‌రాలు ఆమెను తాకాయి. ఇక్క‌డ ఈ వ్య‌వ‌హారం సురేఖ వ్య‌క్తిగ‌తం అనుకుందామా? అంటే.. ఆమె మంత్రి హోదాలో ఉన్నారు. సో.. ఇది రేవంత్ స‌ర్కారుకు సంబంధించిన విష‌యంగానే స‌ర్వ‌త్రా ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఈ క్ర‌మంలో సీఎం రేవంత్ ఎలాంటి చర్య‌లు తీసుకుంటారు? ఎలా స్పందిస్తారు? అనేది ఆస‌క్తిగా మారిం ది. కానీ, రెండు రోజులుగా వివాదం జ‌రుగుతున్నా.. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న మౌనంగానే ఉన్నారు. అస‌లు ఈ విష‌యం త‌న‌కు తెలియ‌ద‌న్న‌ట్టుగానే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ర‌ఘునంద‌న‌రావు-సురేఖ‌ల ఫొటో మార్ఫిం గ్‌తో ప్రారంభ‌మైన వివాదం.. చినుకు చినుకు గాలివాన‌గా మారిన చందంగా పెద్ద సునామీనే ఏర్ప‌డింది. ఈ విష‌యంలో సీఎం జోక్యం చేసుకుని ఇరు ప‌క్షాల‌ను స‌ర్దిచెబితే.. ఇంత పెద్ద వివాదం చోటు చేసుకునేది కాద‌న్న‌ది ప‌రిశీల‌కుల అంచ‌నాగా ఉంది.

అయితే.. రేవంత్ మాత్రం పూర్తిగా మౌనం పాటిస్తున్నారు. మ‌రి ఆయ‌న మ‌న‌సులో ఏముంది? అనేది చ‌ర్చ‌నీయాంశంగా కూడా మారింది. ఇత‌ర మంత్రులు ఎవ‌రూ కూడా ఈ విష‌యంలో జోక్యం చేసుకోలేదు. అదేస‌మ‌యంలో కాంగ్రెస్ అగ్ర‌నేత‌లు కూడా మౌనంగానే ఉన్నారు. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. తుఫాను ముంద‌టి ప్ర‌శాంత‌త ఏదో ఆవ‌రించిన‌ట్టుగా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు. మ‌రి ఆ తుఫాను.. ఏ రూపంలో ఉంటుంది? సురేఖ‌ను మంత్రి వ‌ర్గం నుంచి త‌ప్పిస్తారా? లేక‌.. ఏం చేస్తారు? అనేది చూడాలి. ఏదేమైనా.. రేవంత్ మౌనం ఇప్పుడు మ‌రింత చ‌ర్చ‌నీయాంశంగా మార‌డం గ‌మ‌నార్హం.