ఉదయనిధి స్టాలిన్ కు పవన్ వార్నింగ్

సనాతన ధర్మం వైరస్ లాంటిది, దానిని అరికట్టాలి అని తమిళనాడు సీఎం స్టాలిన్ తనయుడు, హీరో ఉదయనిధి స్టాలిన్ కొద్ది నెలల క్రితం చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ వ్యవహారంపై జాతీయవ్యాప్తంగా బీజేపీ నేతలు, హిందువులు మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే తిరుపతిలో వారాహి డిక్లరేషన్ సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆ వ్యవహారంపై స్పందించారు. ఉదయనిధి స్టాలిన్ ఇతర మతాలపై ఆ తరహా వ్యాఖ్యలు చేసి ఉంటే ఈపాటికి దేశం తగలబడి పోయి ఉండేదని పవన్ అన్నారు. కానీ, హిందువులు మాత్రం మౌనంగా ఉండాలా అని పవన్ ప్రశ్నించారు.

దేవుడి ఆశీసులు తీసుకుని చెబుతున్నానని, సనాతన ధర్మాన్ని ఎవరూ ఏమీ చేయలేరన్న సంగతి గుర్తుంచుకోవాలని పవన్ అన్నారు. ఉదయనిధి స్టాలిన్ వంటి వారు వస్తారు, పోతారు అని, కానీ సనాతన ధర్మం ఎప్పటికీ నిలిచి ఉంటుందని పవన్ చెప్పారు. భారత సనాతన ధర్మాన్ని అంతం చేయాలనుకోవడం ఒక కొండని ఉలి దెబ్బతో కూల్చేయాలనుకోవడమేనని పవన్ అన్నారు. శ్రీరాముడి విగ్రహాన్ని చెప్పులతో దాడి చేశారని, శ్రీరాముడి విగ్రహం తల నరికేశారని, రామాయణం కల్పవృక్షం కాదు విషవృక్షం అన్నారని గుర్తు చేశారు. అలా వ్యాఖ్యానిస్తే హిందువులకు కోపం రాదా అని ప్రశ్నించారు.

అయోధ్య రామ జన్మభూమి లో శ్రీరాముని ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుంటే దేశ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. “నాచ్ గాన” కార్యక్రమం అని ఆ పవిత్ర కార్యక్రమాన్ని రాహుల్ గాంధీ అవమానిస్తారా? అని మండిపడ్డారు. ఏ హిందువూ దీనిని ప్రశ్నించరా? అని పవన్ నిలదీశారు. రాముడిపై జోకులు వేస్తే చూస్తూ కూర్చోవాలా? అని ప్రశ్నించారు.

బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు జరిపి, దుర్గా నవరాత్రులు జరగకుండా అడ్డుకుంటుంటే మాత్రం సూడో సెక్యులరిస్ట్ లు ఒకరు కూడా మాట్లాడరని అన్నారు. రాముడు ఉత్తరాది దేవుడు, ఆర్యుడు అని కొంతమంది తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని, రాముడు ఈ దేశానికి ఆదర్శ ప్రాయుడని, భారతీయ వారసత్వ సంపద అని అన్నారు. ఇస్లాం సమాజం అల్లా అంటే ఆగిపోతారని, మనం మాత్రం గోవిందా అంటే ఆగమని, అది మన దౌర్భాగ్యం అని అన్నారు.

హిందూ ధర్మానికి గౌరవం ఇవ్వడం నేర్చుకోవాలని పవన్ అన్నారు. మిడిల్ ఈస్ట్ దేశాలు ఇస్లాం దేశాలుగా ప్రకటించుకుని ఇతర మతస్తులను తరిమేస్తుంటే ఒక్క సూడో సెక్యులరిస్ట్ మాట్లాడరని, కానీ ఇక్కడ మాత్రం సెక్యులరిజం అని చెప్తారని పవన్ అన్నారు.