మోడీ కోర్టుకు ‘ల‌డ్డూ’ వివాదం.. ఏం చేసినా తంటానే!

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూ క‌ల్తీ వ్య‌వ‌హారం ఇప్పుడు కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు కోర్టులో ప‌డింది. ప్ర‌స్తుతం ఏపీలో ఈ కేసును ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం(సిట్‌) విచారిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే.. ఈ కేసు సుప్రీంకోర్టుకు చేరిన నేప‌థ్యంలో సిట్ విచార‌ణ‌ను వాయిదా వేశారు. వాస్త‌వానికి గురువారం ఈ కేసుపై సుప్రీంకోర్టు ఏదో ఒకటి తేలుస్తుంద‌ని దేశ‌వ్యాప్తంగా శ్రీవారి భ‌క్తులు ఎదురు చూశారు. అయితే.. అనూహ్యంగా ఈ కేసు వాయిదా ప‌డింది.

ఈ క్ర‌మంలో ల‌డ్డూ కేసు విచార‌ణ‌ను ఎవ‌రికి అప్ప‌గించాల‌న్న విష‌యం కేంద్రం మెడ‌కు చుట్టుకుంది. దీనిలో త‌ప్పేముంద‌నే ప్ర‌శ్న రావొచ్చు. ఇక్క‌డే అస‌లు లాజిక్కు ఉంది. ఈ కేసును మూడు మాసాల్లోనే తేల్చేసే దిశ‌గా సుప్రీంకోర్టు ఆదేశాలు ఉండ‌నున్నాయ‌ని న్యాయ‌నిపుణులు భావిస్తున్నారు. ఇదే జ‌రిగితే మూడు మాసాల్లో ల‌డ్డూ కేసు మంచి చెడులు తేలిపోతాయి. పైగా.. ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ‌కు ఇవ్వాలా? లేక సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయ‌మూర్తులకు అప్ప‌గించాల‌న్న స‌మ‌స్య కూడా కేంద్రానికి ఏర్ప‌డింది.

ఈ విష‌యంలో మోడీ తీసుకునే నిర్ణ‌యం కీల‌కంగా మారింది. సీబీఐ వంటి సంస్థ‌ల‌కు అప్ప‌గించి.. ద‌ర్యాప్తు చేయిస్తే.. మూడు మాసాల్లో వ‌చ్చే ‘రిపోర్టు’లో అనుకూలంగా ఉన్నా.. వ్య‌తిరేకంగా ఉన్నా బీజేపీపై తీవ్ర ప్ర‌భావం ప‌డుతుందని అంటున్నారు. అనుకూలంగా ఉంటే.. హిందువుల‌కు తామే కేరాఫ్ అని చెప్పుకొనే బీజేపీకి సానుకూలంగా ఉన్న జ‌గ‌న్ ప్ర‌భుత్వం ‘ఇంత చేసినా’ ఎందుకు ప‌ట్టించుకోలేద‌న్న విమ‌ర్శ కాంగ్రెస్ నుంచి వ్య‌క్త‌మ‌వుతుంది.

ఒక వేళ క‌ల్తీ కాలేద‌ని నివేదిక వ‌స్తే.. బీజేపీ నేతృత్వంలోని ప్ర‌భుత్వం హిందూ ధ‌ర్మాన్ని రోడ్డుకు లాగిందన్న విమ‌ర్శ‌లు కూడా పొంచి ఉన్నాయి. స‌రే.. ఈ విమ‌ర్శ‌లు కామనే క‌దా.. అనుకుంటే.. కుద‌ర‌దు. స‌రిగ్గా మూడు మాసాల్లో కీల‌క‌మైన మ‌హారాష్ట్ర‌లో ఎన్నిక‌లు ఉన్నాయి. ఇక్క‌డ మ‌రోసారి బీజేపీ(వాస్త‌వానికి గ‌తంలో గెలిచింది కాంగ్రెస్‌ కూట‌మి పార్టీ) కూట‌మి అధికారంలోకి రావాల‌ని ఉవ్విళ్లూరుతోంది. కానీ, ఇప్పుడు తిరుమ‌ల ల‌డ్డూ విష‌యంలో తేడా కొడితే.. ఈ ప్ర‌భావం ఇక్క‌డ ఎన్నిక‌ల‌పై తీవ్ర ఎఫెక్ట్ చూపుతుంద‌న్న చ‌ర్చ కూడా తెర‌మీదికి వ‌చ్చింది. సో.. ఎలా చూసుకున్నా.. తిరుమ‌ల ల‌డ్డూ వ్య‌వ‌హారం.. కేంద్రంలోని మోడీ స‌ర్కారును సైతం ఇర‌కాటంలో ప‌డేసింద‌నే చెప్పాలి.