‘జ‌గ‌న్’ కోసం బీజేపీ వెయిటింగ్‌.. వెరీ ఇంట్ర‌స్టింగ్‌!!

YS-Jagan

వైసీపీ అధినేత‌, ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్ కోసం.. బీజేపీ నేత‌లు ఎదురు చూస్తున్నారు. అయితే.. ఇదేదో పార్టీల‌కు సంబంధించిన వ్య‌వ‌హారం కాదు.. వ్య‌క్తిగ‌త విష‌యాలు అంత‌క‌న్నా కావు. కేవ‌లం తిరుమ‌ల తిరుప‌తి వ్య‌వ‌హారం కోస‌మే కావ‌డం గ‌మ‌నార్హం. వైసీపీ అధినేత జ‌గ‌న్ శుక్ర‌వారం రాత్రికి తిరుప‌తి చేరుకుని ఆ వెంట‌నే ఆయ‌న ప్ర‌త్యేక కాన్వాయ్‌లో తిరుమ‌ల‌కు వెళ్తారు. అక్క‌డే శుక్ర‌వారం రాత్రి బ‌సచేసి శ‌నివారం ఉద‌యం శ్రీవారిని ద‌ర్శించుకుంటారు.

అయితే.. శ్రీవారిని ద‌ర్శించుకునే ముందు.. జ‌గ‌న్ డిక్ల‌రేష‌న్‌పై సంత‌కాలు చేయాల‌న్న‌ది బీజేపీ నేత‌లు సంధిస్తున్న డిమాండ్. దీనికి వైసీపీ నేత‌లు స‌సేమిరా అంటున్నారు. మ‌రోవైపు.. టీడీపీ నాయ‌కులు, జ‌న‌సేన నాయ‌కులు కూడా ఇదే డిమాండ్ చేస్తున్నారు. ఇంకో వైపు.. బీజేపీ నాయ‌కురాలు.. హైద‌రాబాద్ కు చెందిన మాధ‌వీల‌త ఏకంగా తిరుప‌తిలోనే తిష్ఠ‌వేశారు. ఎట్టి ప‌రిస్థితిలోనూ జ‌గ‌న్ డిక్ల‌రేష‌న్ ఇచ్చి తీరాల్సిందేన‌ని ఆమె డిమాండ్ చేస్తున్నారు. లేక‌పోతే.. తిరుమ‌ల గిరులు ఎక్క‌కుండా జ‌గ‌న్‌ను అడ్డుకుంటామ‌ని తేల్చి చెబుతున్నారు.

ఇంకోవైపు.. స్థానిక బీజేపీ నాయ‌కులు కూడా సీరియ‌స్‌గానే స్పందిస్తున్నారు. తిరుమ‌ల కు వెళ్లాలంటే.. ముందుగా జ‌గ‌న్ డిక్ల‌రేష‌న్ ఇవ్వాల‌ని.. బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వ‌రి స‌హా కీల‌క నాయ‌కుడు భాను ప్ర‌కాష్ రెడ్డి వంటి నాయ‌కులు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ డిక్ల‌రేష‌న్ వ్య‌వ‌హారం హాట్ హాట్‌గా మారింది. ఇదిలావుంటే.. బీజేపీ నేత‌ల హెచ్చ‌రిక‌లు, వైసీపీ నేత‌ల స‌వాళ్ల నేప‌థ్యంలో స్థానికంగా తీవ్ర ఉద్రిక్త‌త‌లు త‌లెత్తాయి.

ఈ నేప‌థ్యంలో పోలీసులు యాక్ట్‌-30ని అమ‌లు చేస్తున్నారు. ఎక్క‌డిక‌క్క‌డ ప‌హారా పెంచారు. వైసీపీ నాయ‌కుల‌ను ముంద‌స్తు అరెస్టు చేసే అవ‌కాశం ఉంద‌ని రాజ‌కీయ వ‌ర్గాల‌లో చ‌ర్చ సాగుతోంది. ఇదిలావుంటే.. వైసీపీ అధినేత జ‌గ‌న్ మాత్రం త‌న డిక్ల‌రేష‌న్ వ్య‌వ‌హారంపై మౌనంగా ఉన్నారు. ఏం చేస్తార‌నేది ఆయ‌న చెప్ప‌డం లేదు. మొత్తానికి తిరుమ‌ల ల‌డ్డూ వ్య‌వ‌హారం.. చినుకు చినుకు గాలి వాన‌గా మారిన చందంగా రాజ‌కీయాలు మారిపోయాయి.