ప్రభుత్వ మద్యం షాపులు రద్దుకు ఆర్డినెన్స్

వైసీపీ హయాంలో మద్యపాన నిషేధం అంటూ నాసిరకం మద్యాన్ని అధిక ధరలకు విక్రయించారని టీడీపీ, జనసేన, బీజేపీ నేతల నుంచి ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. అదీగాక, వైసీపీ నేతలకు చెందిన మద్యం కంపెనీల నుంచి నాసిరకం మద్యాన్ని…ప్రభుత్వ మద్యం దుకాణాలకు సరఫరా చేశారని ప్రతిపక్ష పార్టీల నేతలు ఆరోపించారు. అంతేకాదు, మద్యం అమ్మకాలకు చెందిన లావాదేవీల్లో అవకతవకలు జరిగాయని, మద్యం దుకాణాల్లో డిజిటల్ చెల్లింపులను అనుమతించలేదని ఆరోపణలు వచ్చాయి.

ఈ క్రమంలోనే ఆబ్కారీ శాఖను ప్రక్షాళన చేస్తానని చెప్పిన సీఎం చంద్రబాబు ఆ దిశగా అడుగులు వేశారు. ఈ క్రమంలోనే తాజాగా రాష్ట్రంలో ప్రభుత్వ మద్యం షాపులు రద్దు చేస్తూ ఏపీలోని ఎన్డీఏ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. దాంతోపాటు, ఏపీలో ఇకపై రిటైల్ మద్యం షాపులకు అనుమతిస్తూ చట్ట సవరణ చేసింది. రాష్ట్రంలో ఉన్న 3,736 మద్యం షాపులకు టెండర్లు పిలిచేందుకు నోటిఫికేషన్ విడుదల చేయనుంది. అందులో 340 మద్యం షాపులను కల్లు గీత కార్మికులకు కేటాయించనుంది.

దసరా పండుగకు ముందే కొత్త మద్యం పాలసీ ప్రకారం రిటైల్ షాపులు ఓపెన్ అయ్యేలా ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. అక్టోబర్ 4, 5 తేదీల నాటికి కొత్త మద్యం విధానం అమల్లోకి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే ఆసక్తి ఉన్నవారి నుంచి దరఖాస్తులు ఆహ్వానించనున్నారు. ఒక్కో టెండర్ దరఖాస్తు రుసుము రెండు లక్షల రూపాయలు ఉంటుందని అంచనా. లాటరీ విధానంలో షాపులు దక్కని వారికి ఆ రుసుము తిరిగి చెల్లించరు.

కొత్త పాలసీ అమల్లోకి వచ్చిన వెంటనే క్వార్టర్ మద్యం రూ. 99కే అందనుంది. దాంతోపాటు, నాణ్యమైన అన్ని మద్యం బ్రాండ్లు అందుబాటులో ఉంచనున్నారు. తిరుపతి మినహా రాష్ట్రంలోని 12 ప్రాంతాల్లో ప్రీమియర్‌ మద్యం దుకాణాలు ఏర్పాటు చేయనున్నారు. టెండర్ దక్కించుకున్న వారి లైసెన్స్ రెండేళ్లపాటు అమల్లో ఉంటుంది. కొత్త పాలసీలో భాగంగా మద్యం దుకాణాలకు ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు అనుమతి ఉంటుంది. జనాభా ఆధారంగా మద్యం దుకాణాల సంఖ్యను నిర్ణయించారు.