చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్న జగన్?

వైసీపీ హయాంలో తిరుమల లడ్డు నాణ్యత దెబ్బ తినడం, నెయ్యి కల్తీ వ్యవహారంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోపణలు చేసినపుడు ఈ విషయం ఇంత చర్చనీయాంశం అవుతుందని ఆయన కూడా ఊహించి ఉండకపోవచ్చు. కానీ అది జాతీయ స్థాయిలో పెద్ద చర్చకే దారి తీసింది. దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఎంతో భక్తితో కొలిచే వేంకటేశ్వరస్వామికి సంబంధించిన ప్రసాదం విషయంలో తప్పు జరిగిందనేసరికి భాష, ప్రాంత భేదం లేకుండా హిందూ భక్తులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఇది రాజకీయ అంశంగా మారిపోయింది.

లడ్డు విషయంలో తమ మీద వచ్చిన ఆరోపణలను తిప్పి కొట్టడంలో జగన్ అండ్ కో ఘోరంగా ఫెయిలయ్యారన్నది స్పష్టం. బాబు ప్రభుత్వం చేసిన ఆరోపణల్లో నిజమెంత.. అందుకు ఏమేర ఆధారాలు చూపించారు.. ఈ వ్యవహారంపై వేసిన సిట్ విచారణలో ఏం తేలుతుంది.. ఈ విషయాలన్నీ పక్కన పెడితే.. ఇప్పటికైతే జగన్ అండ్ కోకు జరిగిన డ్యామేజ్ అంతా ఇంతా కాదు.

జగన్ క్రిస్టియన్ అనే విషయం అందరికీ తెలిసినా.. ఆయన హిందూ వ్యతిరేకి అనే ఆరోపణలను గతంలోనూ రాజకీయ ప్రత్యర్థులు చేసినా జనం పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ ఇప్పుడు మాత్రం ఆయనపై ఈ ముద్ర బలంగా పడిపోయింది. గత ఐదేళ్లలో ఏపీలో క్రిస్టియన్ కన్వర్షన్లు పెద్ద ఎత్తున జరగడంతో పాటు.. హిందూ ఆలయాల్లో ఎన్నో చెడు పరిణామాలు చోటు చేసుకున్నాయి. కానీ అప్పుడు తేలిగ్గానే జనం.. ఇప్పుడు లడ్డు వ్యవహారంతో ఆగ్రహం చెంది గత పరిణామాలు, ఘటనలను దీంతో లింక్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో జగన్ మీద హిందువుల్లో ఒక్కసారిగా తీవ్ర వ్యతిరేకత పెరిగిన సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ తీవ్రత జగన్‌కు కూడా అర్థమైనట్లు కనిపిస్తోంది. అందుకే ఇటీవల ఈ అంశం మీద ప్రెస్ మీట్ పెట్టారు. కానీ దాని వల్ల ప్రయోజనం లేకపోయింది. ఆయన వాదన తర్కానికి నిలబడలేదు. పైగా మరింత ట్రోలింగ్‌కు గురయ్యారు.

ఐతే తన మీద హిందూ వ్యతిరేకి ముద్ర బలంగా పడుతున్న ప్రమాదాన్ని గుర్తించి జగన్.. చంద్రబాబు మీద విమర్శలు, ఆరోపణలు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో పూజలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ మెసేజ్‌లో వేంకటేశ్వరస్వామి బొమ్మ పెట్టడంతో పాటు జగన్‌ సంప్రదాయ దుస్తులు ధరించి వేంకటేశ్వరుడికి నమస్కరిస్తున్న ఫొటో కూడా జోడించారు. ఇదంతా జరిగిన డ్యామేజ్‌ను కంట్రోల్ చేయడానికి చేస్తున్న ప్రయత్నంలా ఉంది కానీ.. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందం లాగే కనిపిస్తోంది. అధికారంలో ఉండగా చేయాల్సిన తప్పులన్నీ చేసేసి.. ఇప్పుడు ఆ తప్పులు బయటికి వస్తుంటే, వాటి మీద చర్చ జరుగుతుంటే ప్రతిగా కూటమి ప్రభుత్వం మీద నిందలు వేసి పూజలు చేయమనడం ఏంటంటూ సోషల్ మీడియాలో జనాలు ప్రతికూలంగానే స్పందిస్తున్నారు జగన్ పిలుపు మీద.