ఆదిమూలం రేప్ కేసులో బిగ్ ట్విస్ట్

సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై ఓ మహిళ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తనను బెదిరించి తనపై ఆదిమూలం అత్యాచారం చేశారని ఆ మహిళ ఆరోపించడం సంచలనం రేపింది. ఈ క్రమంలోనే టీడీపీ అధిష్టానం పార్టీ నుంచి ఆదిమూలంను సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఆదిమూలంపై తాను చేసిన ఆరోపణలు అవాస్తవమని సదరు మహిళ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడం హాట్ టాపిక్ గా మారింది.

తన ఫిర్యాదు ప్రకారం పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో పేర్కొన్న విషయాలన్నీ అవాస్తమని ఆ మహిళా స్వయంగా హైకోర్టులో హాజరై అఫిడవిట్ దాఖలు చేయడం షాకింగ్ గా మారింది. ఆదిమూలంపై పెట్టింది తప్పుడు కేసు అని, దానిని కొట్టివేయాలని జడ్జికి ఆ మహిళ చెప్పడం సంచలనం రేపింది. మూడో వ్యక్తి ఒత్తిడితోనే ఆదిమూలంపై బాధిత మహిళ అటువంటి ఆరోపణలు చేశారని, ఇది హనీ ట్రాప్ అని ఆదిమూలం తరపు న్యాయవాది హైకోర్టులో వాదనలు వినిపించారు.

ఇక, పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో చేసిన ఆరోపణలు అవాస్తమని, ఆ ప్రకారం అఫిడవిట్ దాఖలు చేశామని బాధిత మహిళా తరపు న్యాయవాది వాదించారు వీటిని పరిగణలోకి తీసుకుని ఎమ్మెల్యే ఆదిమూలంపై కేసు కొట్టివేయాలని కోరారు. ఇక, పోలీసులు ప్రాథమిక విచారణ చేయకుండానే తనపై కేసు నమోదు చేశారని, ఆ కేసును కొట్టివేయాలని హైకోర్టును ఆదిమూలం గతంలో ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

ఆ మహిళ దాఖలు చేసిన అఫిడవిట్ ను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి ఆదిమూలంపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించారు. ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 25కు న్యాయమూర్తి వాయిదా వేశారు. అయితే, తనను ఎమ్మెల్యే బెదిరించి రేప్ చేశారని ఆరోపించిన మహిళ ఇప్పుడు ఆ ఆరోపణలు అవాస్తవమని చెప్పడం, కేసు కొట్టేయాలని కోరడం చర్చనీయాంశమైంది. ఏదేమైనా ఈ కేసు కొట్టివేస్తే ఎమ్మెల్యే ఆదిమూలం తో పాటు టీడీపీకి ఊరట లభించినట్లవుతుంది.