చంద్ర‌బాబు… ఎక్క‌డ త‌గ్గాలో కాదు నెగ్గాలో తెలిసినోడు!

ఎక్క‌డ త‌గ్గాలో కాదు.. ఎక్క‌డ నెగ్గాలో కూడా తెలిసిన నాయ‌కుడు చంద్ర‌బాబు!. ఈ విష‌యంలో ఆయ‌న‌కు తిరుగులేద‌ని మ‌రోసారి నిరూపించారు. రాజ‌కీయాల్లో ఉన్న‌వారు.. ముఖ్యంగా అధికారంలో ఉన్న‌వారు.. తాము తీసుకున్న నిర్ణ‌యాల‌కే క‌ట్టుబ‌డ‌తారు. తాముప‌ట్టిన కుందేలుకు మూడేకాళ్ల‌ని మంకు ప‌డ‌తారు కూడా! ఉదాహ‌ర‌ణ‌కు వేలాది మంది రైతులు గ‌గ్గోలు పెట్టినా.. అమ‌రావ‌తిని కొన‌సాగించేది లేద‌ని గ‌త సీఎం జ‌గ‌న్ మంకుప‌ట్టు ప‌ట్టారు. ఫ‌లితంగా ప్ర‌జ‌ల మ‌న‌సులు ఆయ‌న చూర‌గొన‌లేక పోయారు.

కానీ, బాబు దీనికి భిన్నంగా ఆలోచ‌న చేశారు. తాజాగా విజ‌య‌వాడ, బాప‌ట్ల‌, గుంటూరు, ఏలేరు కార‌ణంగా మునిగిన కాకినాడ గ్రామాల్లో బాధితుల‌ను ఆదుకునేందుకు చాలా ఉదారంగా ఆలోచించారు. ముందు ఆయ‌న చెప్పిన దానికంటే కూడా త‌ర్వాత‌.. అది కూడా ఖ‌చ్చితంగా మీడియాతో మాట్లాడుతున్న స‌మ‌యంలోనే అనేక నిర్ణ‌యాలు మ‌ర్చుకుని.. బాధితులకు ఊర‌టనిచ్చే నిర్ణ‌యాలు తీసుకున్నారు. ముందుగా బాదితుల‌కు అంటే.. పూర్తిగా ఇల్లు మునిగిన వారికి రూ.25 వేలు మాత్ర‌మే ఇవ్వాల‌ని అనుకున్నారు. కానీ, అనేక చోట్ల పాక్షికంగా మునిగిన‌ప్ప‌టి న‌ష్టం మాత్రం భారీగా క‌నిపించింది.

ఈ విష‌యాన్ని మీడియా ప్ర‌తినిధులు సీఎంకు వివ‌రించారు. ఒక‌రిద్ద‌రు త‌మ ఫోన్ల‌లోని వీడియోల‌ను కూడా ఆయ‌న‌కు చూపించారు. దీంతో మ‌న‌సు క‌రిగిపోయిన చంద్ర‌బాబు ఇలాంటి వారికి కూడా రూ.25 చొప్పున ప‌రిహారం ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. అదేవిధంగా ఫ‌స్ట్ ఫ్లోర్‌లో నివ‌సించేవారికి ఎలాంటి ప‌రిహారం ఉండ‌ద‌ని.. కొన్నాళ్ల కింద‌ట మంత్రి ఒక‌రు ప్ర‌క‌టించారు. దీనిపై అప్ప‌ట్లో చంద్ర‌బాబు ఇవ్వ‌లేమ‌న్నారు. కానీ, వారి వెత‌ల‌ను కూడా తాజాగా ప‌రిశీల‌నకు తీసుకుని ఫ‌స్ట్ ఫ్లోర్‌లో ఉన్న‌వారికి కూడా ప‌రిహారం కింద రూ.10 వేల సాయం ప్ర‌క‌టించారు. ఇక‌, గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉండి ఇబ్బందులు ప‌డిన వారికి తొలినాళ్ల‌లో రూ.10 వేలు ప్ర‌క‌టించారు. కానీ,ఇప్పుడు ఈ సాయాన్ని రూ.25 వేల‌కు పెంచారు.

అన్నిటికంటే గొప్ప విష‌యం ఏంటంటే. రైతుల‌ను ఆదుకున్న తీరు. ఏలేరులో ప‌ర్య‌టించిన సంద‌ర్భంగా చంద్ర‌బాబు వ‌ర‌దల కార‌ణంగా న‌ష్ట‌పోయిన‌ రైతుల‌కు హెక్టారుకు రూ.10 చొప్పున సాయం చేస్తామ‌న్నారు. కానీ, తాజాగా మాత్రం ఆయ‌న పాతిక వేలు ప్ర‌క‌టించారు. అప్ప‌ట్లో కౌలు రైతుల విష‌యాన్ని త‌ర్వాత చూస్తామ‌న్న ఆయ‌న ఇప్పుడు వారికే ప‌రిహారం ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. అంతేకాదు.. ప‌శువుల విష‌యంలోనూ భారీ ప‌రిహారం ప్ర‌క‌టించారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు చంద్ర‌బాబు విష‌యంలో బాధితుల‌కు ఉన్న అనుమానాలు తీరిపోయి.. హ‌ర్షం వ్య‌క్తం చేస్తుండ‌డం గ‌మ‌నార్హం.