బీఆర్ఎస్ కొరివితో తల గోక్కుంటోందా?

గత ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రూరల్ ఏరియాల్లో బీఆర్ఎస్‌కు గట్టి దెబ్బ పడగా.. ఆ పార్టీకి మెజారిటీ సీట్లు సాధించిపెట్టడంలో హైదరాబాద్ కీలక పాత్ర పోషించింది. ఇక్కడ చాలా నియోజకవర్గాల్లో ఆంధ్ర సెటిలర్ల ఓట్లు ఫలితాలను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నాయన్న సంగతి తెలిసిందే. ఉమ్మడి రాష్ట్రం విడిపోయి తెలంగాణ ఏర్పడ్డపుడు సెటిలర్లకు టీఆర్ఎస్ వల్ల ఇబ్బంది వస్తుందని ఓవైపు.. టీఆర్ఎస్‌ను సెటిలర్స్ నమ్మరని మరోవైపు అనుమానాలు వ్యక్తమయ్యాయి.

కానీ టీఆర్ఎస్ పెద్దగా సెటిలర్లను ఇబ్బంది పెట్టిన దాఖలాలు కనిపించలేదు. అదే సమయంలో సెటిలర్లు కూడా ఆ పార్టీకి అండగా నిలిచిన విషయం ఎప్పటికప్పుడు ఎన్నికల ఫలితాల్లో రుజువు అవుతూనే వచ్చింది. మొత్తంగా చూస్తే బీఆర్ఎస్‌గా మారిన టీఆర్ఎస్, సెటిలర్స్ మధ్య ఒక మ్యూచువల్ ట్రస్ట్ ఏర్పడిందన్నది స్పష్టం. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ రాజకీయం చూస్తుంటే.. ఈ ట్రస్ట్ బ్రేక్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది.

పదేళ్లు తెలంగాణను పాలించాక ఇప్పుడు కొత్తగా టీఆర్ఎస్ నేతలు ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తెస్తున్నారు. ఆల్రెడీ రేవంత్ రెడ్డిని చంద్రబాబు వెనుక ఉండి నడిపిస్తున్నాడంటూ వాళ్లిద్దరినీ టార్గెట్ చేయడం.. అకారణంగా టీడీపీ మీద అక్కసు వెళ్లగక్కడం లాంటివి చేస్తూ సెటిలర్లలో బీఆర్ఎస్ పట్ల వ్యతిరేకత పెరిగేలా చేస్తున్నారు. ఇది చాలదన్నట్లు కౌశిక్ రెడ్డి లాంటి నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ఈ వ్యతిరేకతను మరింత పెంచేలా ఉన్నాయి. అరికపూడి గాంధీని టార్గెట్ చేసే క్రమంలో అతను ఆంధ్ర వాడంటూ తీవ్ర విమర్శలు చేశాడు కౌశిక్ రెడ్డి. దీని మీద సామాజిక మాధ్యమాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.

బీఆర్ఎస్‌కు తాము ఇంత మద్దతుగా నిలిస్తే.. మళ్లీ ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తెచ్చి ఏపీ మీద, సెటిలర్ల మీద విషం చిమ్మడం ఎంత వరకు కరెక్ట్ అనే ప్రశ్న హైదరాబాద్ సహా తెలంగాణలో సెటిలైన ఆంధ్ర వాళ్లలో వ్యక్తమవుతోంది. ఆల్రెడీ రూరల్ ఏరియాల్లో బీఆర్ఎస్ బాగా దెబ్బ తింది. ఇప్పుడు బలం ఉన్న హైదరాబాద్ లాంటి చోట్ల కూడా వ్యతిరేకత పెంచుకునే రాజకీయం చేస్తోందని.. దీని వల్ల ఆ పార్టీ రెంటికి చెడేలా తయారవుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.