టిడిపి, వైసిపిపై బిజెపి కేసులు పెడుతుందా ?

తమపై ఉద్దేశ్యపూర్వకంగా దుష్ర్పచారం చేస్తున్న తెలుగుదేశంపార్టీ, వైసిపిలపై సైబర్ చట్టాల క్రింద కేసులు పెట్టాలని బిజెపి డిసైడ్ చేసింది. తమ పార్టీతో పాటు నేతలపై పై పార్టీలు కావాలనే వాట్సప్, వెబ్ సైట్ల ఆధారంగా బురద చల్లుతున్నట్లు బిజెపి నేతలు మండిపడుతున్నారు. అటువంటి దుష్ప్రచారాన్ని అడ్డుకునేందుకే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిసైడ్ చేసినట్లు సమాచారం.

ఇటీవల కాలంలో మిషన్ ఏపి పేరుతో వాట్సప్ లో ఏర్పడిన ఓ గ్రూపు ద్వారా తమపై బురద చల్లుతున్నట్లు బిజెపి గుర్తించింది. అలాగే మరో మూడు వెబ్ సైట్లతో పాటు యూట్యూబ్ ఛానళ్ళను కూడా గుర్తించినట్లు సమాచారం.

నిజానికి రాష్ట్ర రాజకీయాలంతా పూర్తి అయమయంగా నడుస్తున్నాయి. ఎవరికి ఎవరు ప్రత్యర్ధులో మిత్రులో కూడా జనాలకు తెలీటం లేదు. వైసిపి, టిడిపి విషయంలో జనాలకున్న క్లారిటి బిజెపి, జనసేన విషయంలో లేదన్నది వాస్తవం. నిజానికి బిజెపి, జనసేన కూడా అధికారపార్టీకి ప్రత్యర్ధి పార్టీలనే అనే చెప్పాలి. ఇదే సమయంలో టిడిపికి కూడా ప్రత్యర్ధిగా చెప్పటంలో సందేహం లేదు.

కానీ వివిధ కారణాల వల్ల జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశంపార్టీని ఒక్కమాట కూడా అనటం లేదు. పైగా మొన్నటి వరకు చంద్రబాబునాయుడు ప్రయోజనాల కోసమే జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడిన ఘటనలు అనేకం ఉన్నాయి.

ఇదే సమయంలో బిజెపి అధ్యక్షునిగా ఉన్నంత కాలం కన్నా లక్ష్మీనారాయణ చంద్రబాబుకు మద్దతుగా వ్యవహరించారనే ఆరోపణలు అందరికీ తెలిసిందే. అయితే కన్నా స్ధానంలో సోము వీర్రాజు బాధ్యతలు తీసుకోవటంతో వాతావరణంలో మార్పు వచ్చింది. అయితే వీర్రాజు రావటం రావటమే చంద్రబాబుపై విరుచుకుపడుతు టిడిపిని టార్గెట్ చేసుకున్నారు. ఈ విషయాన్ని వీర్రాజు బాహాటంగా చెప్పే చేస్తున్నారు. దీని కారణంగా టిడిపి, బిజెపిలు ఇక ప్రత్యర్ధి పార్టీలే అనే అభిప్రాయం మొదలైంది.

అయితే బిజెపిలోని పురంధేశ్వరి లాంటి నేతలు కొందరు చేసిన తాజా వ్యాఖ్యలు చంద్రబాబుకు మద్దతుగా ఉన్నట్లు ఆరోపణలు మొదలయ్యాయి. అందుకనే వైసిపి రాజ్యసభ ఎంపి విజయసాయిరెడ్డి స్పందిస్తు పురంధేశ్వరి వ్యాఖ్యలు జాతీయ నాయకురాలిగా కాకుండా జాతి నాయకురాలిగా మాత్రమే ఉందంటూ మండిపడింది. ఇలా రకరకాల కాంబినేషన్లు ఏపి రాజకీయాలు రంజుగా రోజుకోరకంగా మారిపోతోంది. దీంతో జనాల్లో అయితే కన్ఫ్యూజన్ ఉందనే చెప్పాలి. ఇటువంటి నేపధ్యంలోనే వైసిపి, టిడిపి రెండింటిపైన తాము సైబర్ చట్టం క్రింద చర్యలు తీసుకుంటామని బిజెపి ప్రకటించటం ఆసక్తిగా మారింది. చూద్దాం ఎవరిపై ఎవరు చర్యలు తీసుకుంటారో ?