బాబు గారూ మీ ‘బ్రాండ్‌’ నిల‌బెట్టుకోండి: ష‌ర్మిల‌

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ ష‌ర్మిల‌.. తాజాగా సీఎం చంద్ర‌బాబును ఉద్దేశించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో మారు మూల వారికి ఇంకా సాయం అంద‌డం లేద‌ని తెలిపారు. వారికి కూడా సాధ్య‌మైనంత వేగంగా సాయం అందించి.. మేలు చేయాల‌ని .. మీ బ్రాండ్ నిల‌బెట్టుకోవాల‌ని ఆమె సూచించారు. వ‌రద ప్ర‌భావిత ప్రాంతాల్లో మీరు నేరుగా ప‌ర్య‌టించారు. మేం సంతోషించాం. కానీ, బాధితుల‌కు అందుతున్న సాయంలో అనేక లోపాలు ఉన్నాయి. వాటిని స‌రిదిద్దాల్సిన అవ‌స‌రం ఉంది అని ష‌ర్మిల పేర్కొన్నారు.

ప్ర‌జ‌ల బాధ‌లు విన‌ని ప్ర‌భుత్వాలు ఎల్ల‌కాలం మ‌న‌లేవ‌ని, దీనికి వైసీపీపాల‌నే ఉదాహ‌ర‌ణ అని ష‌ర్మిల వ్యాఖ్యానించారు. ప్ర‌స్తుతం అందుతున్న సాయం చాలా మందికి చేర‌డం లేద‌ని.. వారంతా ఆక‌లి కేక‌లు పెడుతున్న‌ట్టు త‌మ‌కు తెలిసింద‌ని ష‌ర్మిల చెప్పా రు. అంద‌రినీ ఆదుకునేందుకు మీ అనుభ‌వాన్ని ఉప‌యోగించి.. మీరు సేవ చేయాల‌ని కోరుతున్నామ‌ని తెలిపారు. “మంచి ప‌రిపాల‌కుడిగా మీరు పేరుంది. దానిని నిల‌బెట్టుకోవాల‌ని కోరుతున్నాం” అని అన్నారు. బుడ‌మేరు వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో ప్ర‌జ‌ల క‌ష్టాలు తెలుసుకునేందుకు మ‌రింత ప్ర‌య‌త్నించాల‌ని అన్నారు.

ఇక‌, చిన్నారులు త‌మ పాకెట్ మ‌నీని ఇవ్వ‌డంపై ష‌ర్మిల స్పందించారు. చిన్నారుల నుంచి విరాళాలు తీసుకోవ‌డం ఏంటి? అని ష‌ర్మిల ప్ర‌శ్నించారు. ఇంత విప‌త్తు స‌మ‌యంలో బీజేపీ నుంచి తీసుకోవాల‌ని ఆమె సూచించారు. కేంద్రంలోని బీజేపీ నుంచి ప‌ది వేల కోట్ల రూపాయ‌లమేర‌కు విప‌త్తు నిధులు తీసుకురావాల‌ని పేర్కొన్నారు. బీజేపీకి అప్ప‌ట్లో వైసీపీ, ఇప్పుడు టీడీపీ మ‌ద్ద‌తు ఇచ్చాయ‌ని.. రాష్ట్రంలోని 25 మంది ఎంపీలు కూడా బీజేపీ ఎంపీలేన‌ని.. కాబ‌ట్టి ఈ విప‌త్తు స‌మ‌యంలో బీజేపీ నుంచి భారీ మొత్తంలో సాయం తీసుకురావాల‌ని ష‌ర్మిల పేర్కొన్నారు.

ప్ర‌జ‌ల‌కు సాయం చేయ‌డంలో పాల‌నా ప‌రంగా మీకు మంచి పేరుంది. దానిని మ‌రింత పెంచుకోండి. మ‌రింత‌గా కాపాడుకోండి. ఈ విప‌త్తు స‌మ‌యంలో మీరు ముందుండి కేంద్రం నుంచి నిధులు తీసుకురండి. చిన్న‌పిల్ల‌ల‌కు వారి త‌ల్లిదండ్రులు ఇచ్చిన పాకెట్ మ‌నీని తీసుకోవ‌డం కాదు. కేంద్రంలోని బీజేపీ నుంచి తీసుకువ‌చ్చి సాయం చేయండి. స‌ర్వ‌స్వం కోల్పోయిన బాధిత కుటుంబానికి ఒక్కొక్క కుటుంబానికీ రూ.ల‌క్ష చొప్పున అయినా ఇవ్వాల్సింది. దీనికి మీరు చొర‌వ తీసుకోవాలి అని ష‌ర్మిల సీఎం చంద్ర‌బాబుకు సూచించారు.