విజ‌య‌వాడ అయిపోయింది.. ఇక‌, విశాఖ!

సీఎం చంద్ర‌బాబు ఇక‌, విశాఖకు వెళ్ల‌నున్నారు. మంగ‌ళ‌వారం రాత్రికి ఆయ‌న విశాఖ‌కు వెళ్ల‌నున్న‌ట్టు ప్ర‌భుత్వ వ‌ర్గాలు తెలిపాయి. ప్ర‌స్తుతం విజ‌య‌వాడ‌లో ప‌రిస్థితి స‌ర్దుమ‌ణిగింది. లోత‌ట్టు ప్రాంతాల్లో ఇంకా వ‌ర‌ద త‌గ్గ‌క పోయినా.. ప్ర‌ధానంగా బుడ‌మేరు తీవ్ర‌త మాత్రం త‌గ్గిపోయింది. దీంతో లోత‌ట్టు ప్రాంతాల్లో నిలిచిపోయిన నీటిని మోటార్ల ద్వారా ఇత‌ర ప్రాంతాల్లోకి తోడుతున్నారు. మ‌రోవైపు.. సింగున‌గ‌ర్‌, ప్ర‌కాశ్ న‌గ‌ర్‌, శాంతిన‌గ‌ర్, కండ్రిక స‌హా.. ఇత‌ర అన్ని ప్ర‌బావిత ప్రాంతాల్లోనూ సాయం అందిస్తున్నారు. రేష‌న్ స‌హా.. పాలు, నీళ్లు ఇత‌ర వ‌స్తువులు కూడా అందిస్తున్నారు.

దీంతో ప్ర‌జ‌లు కొంత ఊర‌ట చెందుతున్నారు. దీంతో మంగ‌ళ‌వారం సాయంత్రం చంద్ర‌బాబు విజ‌య‌వాడ శివారు ప్రాంతాల్లో ప‌ర్యటించి.. మ‌రోసారి బాధితుల‌ను ప‌ల‌క‌రించారు. వారికి అందుతున్న సాయాన్ని విచారించారు. ప్ర‌తి ఒక్క‌రికీ న్యాయం చేస్తామన్నారు. అంద‌రికీ పేరు పేరునా సాయం అందుతోందా లేదా.. అనే విష‌యాన్ని సీనియ‌ర్ అధికారులు ప‌రిశీలించాల‌ని.. ఏ ఒక్క రూ త‌మ‌కు సాయం అంద‌లేద‌న్న ఫిర్యాదు చేయ‌డానికి వీల్లేద‌ని అన్నారు. మ‌రోవైపు బాధితుల‌కు సంబంధించిన ఎన్యూమ‌రేష‌న్ ప్ర‌క్రియ కూడా మంగ‌ళ‌వారం, బుధ‌వారం యుద్ధ‌ప్రాతిప‌దిక‌న చేయ‌నున్నారు.

ఇదిలావుంటే.. విజ‌య‌వాడ ప‌రిస్థితి ఒకింత ఒడ్డున ప‌డుతుంటే..మ‌రోవైపు ఉత్త‌రాంధ్ర జిల్లాలు తుఫాను బీభ‌త్సంతో అల్లాడు తున్నాయి. విశాఖ‌, విజ‌య‌న‌గ‌రం, శ్రీకాకుళం జిల్లాల్లో తుఫాను ప్ర‌భావంతో భారీ వ‌ర్షాలు వ‌చ్చాయి. విజ‌య‌న‌గ‌రంలో కొండ‌చ‌రియ‌లు విరిగి ప‌డి ప‌దికి పైగా గ్రామాల ప్ర‌జ‌లు పున‌రావాస కేంద్రాల్లో త‌లదాచుకుంటున్నారు. నదులు… ఇతర వాగుల పరవళ్లు ఉగ్రరూపం దాల్చాయి. పలు చోట్ల రహదారులు కొట్టుకుపోయి, గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి.

దీంతో ఉత్త‌రాంధ్ర ఇప్పుడు వ‌ణికిపోతున్న ప‌రిస్థితి నెల‌కొంది. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో సీఎం చంద్ర‌బాబు మంగ‌ళ‌వారం రాత్రి లేదా.. బుద‌వారం ఉద‌యం విశాఖ‌ప‌ట్నం వెళ్తున్నారు. అక్క‌డే మూడు రోజుల వ‌ర‌కు ఆయ‌న ఉండ‌నున్నారు. బాధిత ప్రాంతా ల్లో ప‌ర్య‌టించి.. ప్ర‌జ‌ల‌కు ధైర్యం చెప్ప‌నున్నారు. అదేవిధంగా వారికి సాయం కూడా అందించ‌నున్నారు. ప్ర‌స్తుతం చంద్ర‌బాబు ఆన్‌లైన్‌లో అక్క‌డి ప‌రిస్థితిని తెలుసుకుంటున్నారు. అదేవిధంగా సీనియ‌ర్ అధికారుల‌ను కూడా మోహ‌రించారు. అయితే.. క్షేత్ర‌స్థాయిలో తాను ఉంటే త‌ప్ప‌.. బాధితుల‌కు ఓదార్పు ద‌క్క‌ద‌న్న భావ‌న‌తో చంద్ర‌బాబు విశాఖ‌కు వెళ్తున్నారు.