విజ‌య‌వాడ‌ వరదలు.. ‘రంగా’ ఏంచేసేవారు

విజ‌య‌వాడ‌కు ఏ క‌ష్టం వ‌చ్చినా.. ప్ర‌భుత్వాల కంటే కూడా ముందుగా స్పందించే కుటుంబం ఏదైనా ఉంటే అది వంగ‌వీటి ఫ్యామిలీనే. 1980, 1983ల‌లో విజ‌య‌వాడ శివారు ప్రాంతం(ఇప్పుడు మునిగిన ప్రాంత‌మే) ఇదే బుడ‌మేరు కార‌ణంగా నిలువెత్తు నీటిలో మునిగిపోయింది. అయితే.. అప్ప‌ట్లో స‌ర్కారు హైద‌రాబాద్ లో ఉండేది. కానీ, స‌ర్కారుకు ఈ మున‌క విష‌యం తెలిసేలోగానే.. రంగా రంగంలోకి దిగిపోయేవారు. పార్టీలు, నాయ‌కులు.. అన్న తేడా లేకుండా.. అంద‌రినీ క‌లుపుకొని పోయేవారు.

పెద్ద ఎత్తున లారీలు పెట్టి.. అంద‌రినీ.. ఇందిరాగాంధీ మునిసిప‌ల్ స్టేడియానికి త‌ర‌లించేవారు. అక్క‌డ చాల‌క‌పోతే.. పీడ‌బ్ల్యూడీ గ్రౌండ్‌లో శిబిరాలు ఏర్పాటు చేసి.. అక్క‌డ‌కు త‌ర‌లించేవారు. స్వచ్ఛంద సంస్థ‌ల‌ను అలెర్ట్ చేసేవారు. తానే స్వయంగా రంగంలోకి దిగిన రంగా.. న‌డుములోతు నీటిలో న‌డుస్తూ.. ప్ర‌జ‌ల‌ను కాపాడే ప్ర‌య‌త్నం చేశారు. తానే స్వ‌యంగా బాధితుల‌ను ఒడ్డుకు చేర్చి లారీలు ఎక్కిన సంఘ‌ట‌న‌లు అనేకం.

అందుకే.. విజ‌య‌వాడ‌కు ఏ క‌ష్టం వ‌చ్చినా.. ముందు వినిపించే పేరు రంగా. అంతేకాదు.. రాధా-రంగా మిత్ర‌మండ‌లి అప్పుడే ఏర్ప‌డింది. వీరైతే.. చిన్న‌పిల్ల‌ల‌ను, వృద్ధుల‌ను త‌మ చేతుల‌పైకి ఎత్తుకుని బాధిత ప్రాంతాల నుంచి కాపాడేవారు. వ‌చ్చిన లారీలు వ‌స్తూనే ఉండేవి. చిత్రం ఏంటంటే.. మ‌నుషుల‌తో పాటు.. వారి వ‌స్తువుల‌ను కూడా రంగా సాధ్య‌మైనంత వ‌ర‌కు కాపాడే ప్ర‌య‌త్నం చేసేవారు. ఏ ఒక్కరినీ వ‌దిలి పెట్టేవారు కాదు. వాళ్లు మ‌న పార్టీ కాద‌ని ఎవ‌రైనా అంటే.. ఇప్పుడు రాజ‌కీయాలేంట‌ని ఖ‌సురుకునే వారు. వారికి కూడా సాయం చేసేవారు.

కానీ.. ఇప్పుడు అదే విజ‌య‌వాడ శివారు ప్రాంతం మునిగిపోతే.. ఆయ‌న వార‌సుడు వంగ‌వీటి రాధా జాడే క‌నిపించ‌డం లేదు. క‌నీసం.. ఆయ‌న ఒక్క ప్ర‌క‌ట‌న కూడా చేయ‌లేదు. చేస్తే.. రాధా రంగా మిత్ర మండ‌లి అయినా.. ముందుకు వ‌చ్చేది. సాయానికి చేతులు చాపేది. కానీ, రంగా రాజ‌కీయ వార‌స‌త్వాన్ని కావాల‌ని అనుకున్న రాధా.. ఆయ‌న దాతృత్వాన్ని వ‌ద్ద‌నుకుంటున్నారా? సాయం చేసే గుణాన్ని కాద‌నుకుంటున్నారా? అనేది చ‌ర్చ‌. అయితే..రంగా ఎదిగింది.. జ‌నం గుండెల్లో నిలిచింది.. రాజ‌కీయంగా కంటే.. సేవ‌తోనే అనే విష‌యం రాధాకు తెలియందికాదు!!