జీవితంలో ఫ‌స్ట్ టైమ్‌: చంద్ర‌బాబు

త‌న రాజ‌కీయ జీవితంలో విజ‌య‌వాడ‌లో సంభ‌వించిన స్థాయి వ‌ర‌ద‌ల‌ను చూడ‌డం ఇదే తొలిసార‌ని సీఎం చంద్ర‌బాబు అన్నారు. వాతావ‌ర‌ణంలో చోటు చేసుకున్న మార్పులు, క్లౌడ్ బ‌ర‌స్ట్ వంటి ఘ‌ట‌న‌లు సంభ‌వించిన‌ప్పుడు మాత్ర‌మే ఇలాంటి ఉప‌ద్ర‌వాలు వ‌స్తాయ‌ని.. అయితే వాటికి భిన్నంగా బుడ‌మేరు పొంగింద‌న్నారు. దీనికి కార‌ణం.. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో జ‌రిగిన త‌ప్పులేన ని చెప్పారు. వాగుల నిర్వ‌హ‌ణ‌ను గ‌త ప్ర‌భుత్వం పక్క‌న పెట్టింద‌ని.. ఆ కార‌ణంగానే బుడ‌మేరు కు ఈ స్థాయిలో వ‌ర‌ద వ‌చ్చింద‌న్నారు. తాజాగా ఆయ‌న గురువారం రాత్రి విజ‌య‌వాడ‌లో మీడియాతో మాట్లాడారు.

త‌న అనుభవ సారాన్ని పిండి మ‌రీ ప్ర‌భావిత ప్రాంతాల్లోని ప్ర‌జ‌ల‌కు సేవ చేస్తున్నాన‌ని తెలిపారు. గ‌త నాలుగు రోజులుగా తాను వ‌ర‌ద‌లోనే ఉన్నాన‌ని చెప్పారు. నిరంతరం.. ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉన్నాన‌ని అన్నారు. టోల్ ఫ్రీ నెంబ‌ర్లు ఏర్పాటు చేసి బాధితుల‌ను ఆదుకునే కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టామ‌న్నారు. అదేస‌మ‌యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా రంగంలోకి దిగార‌ని.. సాయం అందించ‌డంలో నిరంత‌రం పార్టీ యంత్రాంగం కృషి చేస్తోంద‌ని తెలిపారు. ఎక్క‌డా బాదితుల‌ను వ‌దిలేసే ప్ర‌సక్తి లేద‌న్నారు. త‌మ‌వంతు ప్ర‌య‌త్నాలు ఎప్పుడూ ముమ్మ‌రంగా సాగుతాయ‌న్నారు.

ప్ర‌కాశం బ్యారేజీ సామ‌ర్థ్యం పెంచుతాం

కృష్ణాన‌దికి వ‌ర‌ద‌లు వ‌చ్చిన‌ప్పుడు పొంగకుండా.. స‌మీప్రాంతంలో నీరు చేర‌కుండా చ‌ర్య‌లు చేప‌డ‌తామ‌ని చంద్ర‌బాబు చెప్పారు. ఈ క్ర‌మంలో బ్యారేజి సామర్థ్యం పెంచేందుకు అధ్యయనం చేయిస్తామ‌ని తెలిపారు. ప్ర‌స్తుతం 12 ల‌క్ష‌ల క్యూసెక్కుల వ‌ర‌ద నీరు వ‌చ్చిందని.. అయితే.. భ‌విష్య‌త్తులో15 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చినా తట్టుకునేలా ప్లాన్ చేస్తామ‌న్నారు. క‌ర‌కట్ట‌ల ఆక్ర‌మ‌ణ‌లు తొల‌గించాల్సి ఉంద‌ని.. గ‌త ప్ర‌భుత్వంలోనే.. ఇలా జ‌రిగింద‌ని చంద్ర‌బాబు ఆరోపించారు.

బుడ‌మేరుకు స్థాయికి మించి!

బుడ‌మేరు స్థాయికి మించిన వ‌ర‌ద నీరు వ‌చ్చింద‌ని.. అందుకే శివారు ప్రాంతాలు మునిగిపోయాయ‌ని చంద్ర‌బాబు తెలిపారు. బుడ‌మేరును బ్రిటీష్ హ‌యాంలో 10 వేల క్యూసెక్కుల సామ‌ర్థ్యంతో నిర్మించారని, కానీ.. తాజాగా ఎగువ రాష్ట్రాల్లో కురిసిన వ‌ర్షాల‌తో 35 వేల క్యూసెక్కుల నీరు వ‌చ్చింద‌ని.. దీంతో బుడ‌మేరు ప్ర‌భావం విజ‌య‌వాడ శివారు ప్రాంతాల‌పై ప‌డింద‌ని చంద్ర‌బాబు వివ‌రించారు. దీనిని కూడా ప‌టిష్ట ప‌ర‌చాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.