హైకోర్టులో వైసీపీ నేతలకు షాక్

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు రాష్ట్ర హైకోర్టులో చుక్కెదురైంది. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంతో పాటు, అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నివాసంపై దాడి కేసులోనూ నేతలకు ముందస్తు బెయిలు ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది.

ఈ కేసుల్లో మాజీ మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, మాజీ ఎంపీ నందిగాం సురేష్, వైకాప నేత దేవినేని అవినాష్ తదితరులు నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో ముందస్తు బెయిలు కోసం వీరు హైకోర్టును ఆశ్రయించారు.

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ కేంద్ర కార్యాలయం మీద, చంద్రబాబు నివాసం మీద వందలాది మంది దాడి చేశారు. ఈ దాడిలో విలువైన వస్తువులు, ఫర్నీచర్ ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో బెయిలుకు కోర్టు నిరాకరించగా సుప్రీంకోర్టును ఆశ్రయించే వరకు అరెస్టు నుండి మినహాయింపు ఇవ్వాలని వైసీపీ నేతలు కోరారు. అరెస్టు నుండి మినహాయింపు ఇవ్వొద్దని టీడీపీ తరపు న్యాయవాదులు కోరగా హైకోర్టు మధ్యాహ్నం తీర్పు వెల్లడించనున్నది.