వైసీపీకి కాపులు ప‌ర్మినెంట్ `ఎండ్` కార్డ్‌

సామాజిక వ‌ర్గాల ప‌రంగా కాపుల ప్ర‌భావం తాజా ఎన్నిక‌ల్లో బాగానే క‌నిపించింది. బాగా అనే కంటే.. కూడా ఇంకా బాగా ప‌నిచేసింద‌నే చెప్పాలి. జ‌న‌సేన‌ను గెలిపించుకునేందుకు.. ముఖ్యంగా ప‌వ‌న్ కోసం కాపులు ఏక‌తాటిపైకి వ‌చ్చారు. ఫ‌లితంగా కాపు సామాజిక వ‌ర్గం ప్ర‌భావం ఎక్కువ‌గా ఉన్న అన్ని జిల్లాల్లోనూ వైసీపీ తుడిచి పెట్టుకుపోయింది. తూర్పు, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల్లో ఒక్క సీటు కూడా ద‌క్కించుకోలేదు.

ఇక‌, రాయ‌ల‌సీమ‌లో బ‌లిజ(కాపుల్లో ఒక వ‌ర్గం) సామాజిక వ‌ర్గం ప్ర‌భావం ఎక్కువ‌గా ఉన్న నేప‌త్యంలో ఇక్క‌డ కూడా ఏడు స్థానాలు మిన‌హా.. మొత్తంగా కూట‌మి తుడిచి పెట్టేసింది. స‌హ‌జంగా ఇంత రిజ‌ల్ట్ వ‌చ్చిన‌ప్పుడు.. దీనిని కోల్పోయిన పార్టీగా వైసీపీ అలెర్ట్ అవ్వాలి. గ‌తంలో 2019 ఎన్నిక‌ల్లో రెడ్డి స‌మాజం మొత్తం టీడీపీని వ‌దిలేసింది. రెడ్లు బ‌లంగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాలు.. జిల్లాల్లో ఆ పార్టీ ఒక్క‌టంటే ఒక్క సీటును కూడా ద‌క్కించుకోలేక పోయింది.

దీంతో అలెర్ట్ అయిన చంద్ర‌బాబు వెంట‌నే త‌న పార్టీలోని రెడ్డి నేత‌ల‌ను రంగంలోకి దింపి.. మంత‌నాలు జ‌రిపారు. ఇదే.. త‌ర్వాత కాలంలో రెడ్ల‌ను పార్టీకి చేరువ చేసింది. ఈ త‌ర‌హా వ్యూహాలు వేయ‌డంలో వైసీపీ విఫ‌ల‌మ‌వుతోంది. తాజాగా కాపు సామాజిక వ‌ర్గం మ‌రింత‌గా వైసీపీకి దూర‌మైంది. ఏ స‌మ‌స్య ఉన్నా.. త‌మ వారితోనే చ‌ర్చించాల‌ని నిర్ణ‌యించింది. నిజానికి కాపులు.. త‌మ స‌మ‌స్య‌ల‌ను రాజ‌కీయాల‌కు అతీతంగా చ‌ర్చించేందుకు ముందుకు వ‌స్తారు. పార్టీల‌తో సంబంధం లేకుండా ఆహ్వానిస్తారు.

అలాంటిది ఇప్పుడు వైసీపీని పూర్తిగా దూరం పెట్ట‌డానికి కార‌ణం.. జ‌గ‌న్ వైఖ‌రే కార‌ణంగా క‌నిపిస్తోంది. కాపు నాయ‌కులు పార్టీకి రాజీనామా చేస్తున్నా.. ఆయ‌న పిలిచి మాట్లాడ‌క‌పోవ‌డంతోపాటు.. వారి స‌మ‌స్య‌లు తెలుసుకునే ప్ర‌య‌త్నం చేయ‌క‌పోవ‌డం.. వంటివి మిగిలి ఉన్న కొద్దిపాటి కాపు స‌మాజాన్ని నివ్వెర‌పోయే లా చేస్తోంది. ఏలూరు మాజీ ఎంపీ ఆళ్ల నాని పార్టీకి రాజీనామా చేశారు. గుంటూరు నుంచి పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే కిలారు రోశ‌య్య పార్టీకి రాం రాం చెప్పారు.

ఇలా.. కొంద‌రు నాయ‌కులు పార్టీని వీడినా.. జ‌గ‌న్ వారిని ప‌ట్టించుకోక‌పోవ‌డంతో ఇక‌, త‌మ‌కు కూడా జ‌గ‌న్‌తో అవ‌స‌రం లేద‌న్న‌ట్టుగానే కాపులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనిని ఇప్ప‌టికైనా స‌రిచేసుకునే ప్ర‌య‌త్నం చేస్తారో.. లేక‌.. జ‌గ‌న్ మొండిగానే ఉంటారో చూడాలి.