క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే ఇవే అనుమానాలు పెరిగిపోతున్నాయి. పైగా తాజాగా పంజాబ్ రాష్ట్రంలోని అకాలీదళ్ పార్టీ నిర్ణయం తర్వాత అనుమానాలు కావని నిజాలే అని జనాల్లో చర్చ మొదలైపోయింది. అకాలీదళ్ చీఫ్ సుఖ్ బీర్ సింగ్ బాదల్ మీడియాతో మాట్లాడుతూ రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నిరసనగానే తాము ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేసినట్లు ప్రకటించారు.
అకాలీదళ్ తాజా నిర్ణయంతో ఎన్డీఏతో ఉన్న 23 ఏళ్ళ అనుబంధాన్ని ఒక్కసారిగా తెంచేసుకున్నట్లైంది. అంటే తమకు వ్యక్తిగత ప్రయోజనాలకన్నా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమన్న విషయాన్ని జనాలకు చాలా గట్టిగానే చెప్పింది.
సుఖ్ బీర్ తాజా ప్రకటన తాలూకు ప్రకంపనలు ఏపిలో కనబడుతున్నాయి. వ్యవసాయ సంస్కరణ బిల్లుకు అధికార, ప్రతిపక్షాలైన వైసిపి, టిడిపిలు రెండు పోటిపడి మద్దుతు ప్రకటించాయి. నిజానికి వైసిపి, టిడిపి ఎంపిల అవసరం ఎన్డీఏకి లోక్ సభలో లేదు. అయితే రాజ్యసభలో మాత్రం వైసిపి అవసరం ఎన్డీఏకి చాలా ఉందన్న విషయం తెలిసిందే.
రాజ్యసభలో వైసీపీకి ఆరుగురు రాజ్యసభ ఎంపిల బలం ఉండటమే ప్రధాన కారణం. పార్లమెంటులో ఓటింగ్ విషయంపై జనాల్లో రెండు పార్టీల విషయంలో రాంగ్ సిగ్నల్స్ వెళిపోయాయి. అవసరం లేకపోయినా ఎగబడి వైసిపి కేంద్రానికి మద్దతు పలుకుతున్నాయంటే కేవలం పార్టీ అధినేతలపై ఉన్న కేసులే కారణమా ? అనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది.
జగన్మోహన్ రెడ్డిపై ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులు సిబిఐ విచారణలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. సిబిఐ అంటేనే కేంద్రప్రభుత్వం చేతిలో ఉన్న చిలక లాంటిది. అందుకనే ప్రతిపక్షంలో ఉన్నపుడు కూడా జగన్ ఎన్డీఏకి ఏకపక్షంగా మద్దతుగా నిలబడిన విషయం గుర్తుండే ఉంటుంది.
తన కేసుల విషయంలోనే జగన్ కేంద్రానికి లొంగిపోయాడనే చర్చ జనాల్లో ఎప్పటి నుండో జరుగుతోంది. ఒకవైపు కొన్ని కేసుల్లో సిబిఐ విచారణ జరుగుతుంటే మరికొన్ని కేసులపై కోర్టుల్లో విచారణ జరుగుతోంది. సిబిఐ విచారణలు, కోర్టుల్లో విచారణలు జరిగి కేసుల నుండి బయటపడేంత వరకు జగన్ స్వతంత్రంగా వ్యవహరించే అవకాశం లేదనే చెప్పాలి.
ఇదే సమయంలో చంద్రబాబునాయుడు వ్యవహారం కూడా ఇంతకన్నా భిన్నంగా ఏమీ లేదు. జగనేమో తన కేసులపై కేంద్రానికి భయపడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు ఉన్న ఒక్క సభ్యుడితో వ్యతిరేకించినా ఏం ప్రయోజనం.. అసలే జగన్ తో కేంద్రం సఖ్యంగా ఉంది. అదింకా పెంచినట్లు అవుతుందని ఒక ఓటుతో పోయేదేముంది, వచ్చేదేముంది వేసెయ్ అంటూ జై కొట్టమన్నారు. అంతేగాకుండా రాష్ట్రంలో జగన్ దూకుడుకు కళ్లెం వేయాలంటే మోడీతో సఖ్యత అవసరం అని చంద్రబాబు భావిస్తున్నారు.ఇటువంటి అనేక కారణాలతో చంద్రబాబు కూడా అడగకుండానే బిజెపికి మద్దతు పలుకుతున్నారు.
ఇక జనసేన పరిస్థితి చెప్పేదేముంది. వారితో ఆల్రెడీ పొత్తులో ఉంది. పైగా ఈ బిల్లులను వ్యతిరేకించకపోగా అనుకూలంగా మాట్లాడుతోంది. మరి ఇటువంటి పార్టీలున్నపుడు అకాలీదళ్ తీసుకున్న నిర్ణయం జనాల్లో చర్చకు దారితీయకుండా ఎలాగుంటుంది ?
Gulte Telugu Telugu Political and Movie News Updates