ఆ ఫాంహౌస్ నాది కాదు – కేటీఆర్

హైదరాబాద్ పరిధిలోని చెరువులు, కుంటలలో అక్రమంగా నిర్మించిన భవనాలు, ఫాంహౌస్ ల మీద హైడ్రా చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఫాంహౌజ్ ఉంటున్నట్లు మీడియాలో ప్రచారం జరుగుతుందని, అసలు తనకు ఎలాంటి ఫాంహౌజ్ లు లేవని స్పష్టం చేశారు.

నా మితృని ఫాంహౌజ్ గత కొన్నేళ్లుగా లీజుకు తీసుకున్న విషయం వాస్తవం అని, ఒక వేళ ఆ ఫాంహౌజ్ ఎప్ టీ ఎల్ పరిధిలోని గానీ, బఫర్ జోన్ పరిధిలో గానీ ఉన్నట్లయితే నేనే దగ్గర ఉండి కూలగొట్టిస్తానని కేటీఆర్ అన్నారు. ఈ విషయం తెలిసి నా మితృడు బాధపడినా సరేనని, మంచి జరుగుతుంది అంటే అందరం ఆహ్వానిద్దాం అని తెలిపారు.

అయితే ఇదే సమయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఆయన సోదరుడు, ఎమ్మెల్యే వివేక్ వెంకట్ స్వామి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మాజీ ఎంపీలు మధు యాష్కీ గౌడ్, కేవీపీ రామచందర్ రావులతో పాటు సీఎం రేవంత్ రెడ్డికి కూడా అక్కడ భవనాలు ఉన్నాయని ఎక్కడ ఎవరివి నిర్మాణాలు అక్రమంగా ఉన్నా ఒకదాని వెనక ఒకటి కూలగొట్టి ప్రజలకు పారదర్శకంగా నిలుద్దాం అని కేటీఆర్ సూచించారు.

కాంగ్రెస్ పార్టీ మంత్రి, నేతల భవనాల నుండే మొదలు పెడదామని, కావాలంటే మీడియాకు ఆయన ఫాంహౌజ్ అడ్రస్ ఇస్తానని, తప్పు ఎవరు చేసినా తప్పేనని, ఖచ్చితంగా అక్రమ నిర్మాణాలను తొలగించాల్సిందేనని కేటీఆర్ అన్నారు.