“వైసీపీలో దండు పాళ్యం బ్యాచ్‌”

వైసీపీలో ఉన్న‌వారంతా దండు పాళ్యం బ్యాచేన‌ని టీడీపీ సీనియ‌ర్ నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంక‌న్న ఫైర‌య్యారు. వైసీపీ హ‌యాంలో ప‌నిచేసిన అధికారులు అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను నాకించేశార‌ని చెప్పారు. ఎక్క‌డిక‌క్క‌డ త‌ప్పులు క‌నిపిస్తున్నాయ‌ని.. అయితే, విచార‌ణ‌ల‌కు భ‌య‌ప‌డి రికార్డుల‌ను, ఫైళ్ల‌ను కూడా త‌గుల బెడుతున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. “జగన్‌కు ఛాలెంజ్ చేస్తున్నా. ఒక్క శాఖలో అయినా అవినీతి చేయలేదని చెప్పగలరా?” అని వెంక‌న్న ప్ర‌శ్నించారు.

వైసీపీ హ‌యంలో అందిన కాడికి దండుపాళ్యం బ్యాచ్ దండుకుంద‌న్న వెంక‌న్న అవినీతి చేశార‌నే భ‌యంతోనే ఫైళ్ల‌ను త‌గుల‌బెడుతున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. విజ‌య‌వాడ‌లో మీడియాతో మాట్లాడిన బుద్దా వెంక‌న్న అన్ని శాఖ‌ల్లోనూ వైసీపీ హ‌యాంలో అడ్డగోలుగా నియామకాలు జ‌రిగాయ‌న్నారు. వైసీపీ నేతలు, కొంతమంది అధికారులు కుమ్మక్కై ప్ర‌జాధ‌నాన్ని అందినంత దోచుకున్నారని విమ‌ర్శించారు. “దండు పాళ్యం బ్యాచ్‌ను, ఆ బ్యాచ్ నాయ‌కుడిని చూసి భయపడిన పారిశ్రామిక వేత్త‌లు.. ఏపీలో పెట్టుబ‌డులు పెట్టేందుకు జంకా”ర‌ని తెలిపారు.

చంద్ర‌బాబు తిరిగి ముఖ్య‌మంత్రి కావ‌డంతో పెట్టుబ‌డులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్త‌లు క్యూ క‌డుతున్నార‌ని బుద్ధా వెంక‌న్న చెప్పారు. త‌మ ఘ‌న కార్యం వ‌ల్లే ఏపీకి పెట్టుబ‌డులు వ‌స్తున్న‌ట్టు వైసీపీ నేత‌లు చెప్పుకోవ‌డానికి సిగ్గుప‌డాల‌ని వ్యాఖ్యానించారు. అగ్రిగోల్డ్ భూముల‌ను కొట్టేసేందుకు మాజీ మంత్రి జోగి ర‌మేష్ ప్ర‌య‌త్నించార‌ని బుద్దా వెంక‌న్న దుయ్య‌బ‌ట్టారు. “జగన్ పెద్ద పెద్ద దోపిడీలు చేశారు. ఆయన అడుగు జాడల్లో ఆ పార్టీ నేతలు అందినకాడికి దోచుకున్నారు” అని వెంక‌న్న మండిప‌డ్డారు.