కుప్పంలో దెబ్బ‌కు దెబ్బ‌..

దెబ్బ‌కు దెబ్బ‌..! అన్న‌ట్టుగా మారిపోయింది వైసీపీ ప‌రిస్థితి. ఒక‌ప్పుడు టీడీపీ అధినేత చంద్ర‌బాబును దెబ్బ‌తీసేందుకు ప్ర‌య‌త్నించిన ఉమ్మ‌డి చిత్తూరు జిల్లా కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో అనూహ్యంగా వైసీపీకే దెబ్బ ప‌డిపోయింది. ఇక్క‌డ ఇప్పుడు జెండామోసేందుకు కూడా నాయ‌కుడు లేకుండా పోయారు. ఎన్నిక‌ల పోలింగ్ జ‌రిగిన కేవ‌లం రెండు మాసాల్లోనే వైసీపీ ఖాళీ అయిపోవ‌డం.. కీల‌క నాయ‌కులు జారు కోవ‌డం.. అస‌లు ఇంచార్జ్ జాడ కూడా క‌నిపించ‌క పోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

కుప్పంలో చంద్ర‌బాబును ఓడించాల‌ని కంక‌ణం క‌ట్టుకున్న వైసీపీ.. దానికి త‌గిన విధంగా గ‌త ఐదేళ్ల పాల‌న‌లో ఇక్కడ టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌ను త‌న‌వైపు తిప్పుకొంది. కీల‌క నేత‌ల‌పై కేసులు పెట్టి వారి నోరు కూడా మూయించింది. ఇక‌, కుప్పం మునిసిపాలిటీని అభివృద్ది కూడా చేసింది. మొత్తంగా చంద్ర‌బాబును ఓడించి తీరాల‌న్న క‌సితో అయితే.. పనిచేసింది. కానీ, వైసీపీ ఒక‌టి త‌లిస్తే.. ప్ర‌జ‌లు మ‌రొక‌టి త‌ల‌చారు. ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబు మరింత ఎక్కువ మెజారిటీతోగెలిపించారు.

ఇక‌, ఈలోగా.. మ‌ద‌న‌ప‌ల్లె స‌బ్ క‌లెక్ట‌ర్ కార్యాల‌యం అగ్ని ప్ర‌మాదం ఘ‌ట‌న వెలుగు చూసింది. దీంతో వైసీపీ నాయ‌కులు ఒక్కొక్క‌రు కాదు.. గుంపులుగుంపులుగా.. పార్టీ జెండా మార్చేస్తున్నారు. మ‌రోవైపు.. పార్టీ త‌ర‌ఫున పోటీ చేసి చంద్ర‌బాబుపై ఓడిపోయిన‌.. భ‌ర‌త్ కూడా క‌నిపించ‌డం లేదు., ఎన్నిక‌ల ఫ‌లితాల అనంత‌రం.. ఆయ‌న బెంగ‌ళూరుకు వెళ్లిపోయి.. అక్క‌డే తిష్ఠ వేశారు. పైగా.. ఇక్క‌డ వైసీపీ కార్యాల‌యం కూడా.. లేకుండా పోయింది. దీనిలో కొంద‌రు చిన్న‌పాటి హోట‌ల్ న‌డుపుతున్నారు.

కార‌ణం ఇదీ..

చంద్ర‌బాబు కుప్పం వ‌చ్చిన రెండు సార్లు ఇక్క‌డ అల‌జ‌డి రేగింది. ఆయ‌న‌పై కొంద‌రు రాళ్లు రువ్వారు. అదేవిధంగా పార్టీ బ్యాన‌ర్లు కూడా చించేశారు. ఆ కేసుల‌ను ఇప్పుడు తిర‌గ‌దోడుతున్నారు. దీనికి భ‌య‌ప‌డి కూడా.. కొంద‌రు వైసీపీ నాయ‌కులు.. కుప్పం నుంచి జారుకున్నారు. గ‌తంలో త‌ర‌చుగా వ‌చ్చిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి కూడా ఇప్పుడు కుప్పానికి రావ‌డం మానేశారు. దీంతో ఇక వైసీపీలోఒ ఉంటే.. కేసులు త‌ప్ప‌వ‌ని భావిస్తున్న నాయ‌కులు సాధ్య‌మైనంత వ‌ర‌కు టీడీపీ గూటికి చేరుతున్నారు. మిగిలిన వారు అజ్ఞాతంలోకి వెళ్లిపోవ‌డంతో కుప్పం ఖాళీ అయిపోయింది.